AP High Court: రాజకీయ పార్టీలకు ఏపీ హైకోర్టు షాక్
ఏపీలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించడం లోకల్ ఎన్నికల నిర్వహణను నిరవధికంగా వాయిదా వేసే పరిస్థితికి దారితీస్తోంది.
AP High court shocks political parties: ఏపీలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించడం లోకల్ ఎన్నికల నిర్వహణను నిరవధికంగా వాయిదా వేసే పరిస్థితికి దారితీస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రాతిపదికన చూస్తే.. లోకల్ బాడీస్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని, కానీ ఏపీలో ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటేసాయని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై గతంలోనే విచారణ పూర్తి కాగా.. తాజాగా మంగళవారంనాడు ఏపీ హైకోర్టు ధర్మాసనం మరోసారి ఇరు వర్గాల వాదనలు విన్నది. గతంలో సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్లో 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే వీరి వాదనతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విభేదించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు.
ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అమరావతి హైకోర్టు ధర్మాసనం.. అన్ని పిటిషన్లపై విచారణ ముగిసిందని ప్రకటించింది. అయితే తీర్పును వెలువరించేందుకు మరింత లోతైన పరిశీలన అవసరమని భావించిన హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వులో వుంచింది.
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ సిద్దమవుతున్న ఏపీ రాజకీయ పార్టీలకు తీర్పు రిజర్వు కావడం ఒకింత షాకిచ్చే అంశమే. నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలొస్తాయనుకుని అధికార వైసీపీ, విపక్ష టీడీపీలతోపాటు.. కొత్తగా జతకట్టిన జనసేన-బీజేపీ పార్టీలు తమ తమ కార్యాచరణను సిద్దం చేసుకున్నాయి. తలా ఒక కారణంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తీర్పు రిజర్వు కావడం ఒకింత షాకిచ్చే అంశంగానే కనిపిస్తోంది.
Read this: జగన్ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు ప్రశంస World Bank appreciates Jagan government