చనిపోయేముందు క్లూ ఇచ్చిన పోలీస్.. నిందితుల పట్టివేత
సాధారణంగా సినిమాల్లో మంచి పాత్రలు చనిపోయే ముందు హీరోలకు కొన్ని క్లూలను ఇస్తుంటాయి. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం.
సాధారణంగా సినిమాల్లో మంచి పాత్రలు చనిపోయే ముందు హీరోలకు కొన్ని క్లూలను ఇస్తుంటాయి. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలో ఓ పోలీస్ తాను చనిపోయే ముందు సమయస్ఫూర్తిని చూపించారు. తమను ఎవరు చంపారో క్లూ ఇచ్చారు. దీంతో ఆ నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. గత వారం బుటానా పోలీస్ స్టేషన్ సమీపంలో సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు రోడ్డు మీదే మద్యం తాగుతూ కనిపించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రవీందర్ సింగ్(28), కప్తాన్ సింగ్(43) వారిని వారించే ప్రయత్నం చేశారు. దాంతో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య వివాదం జరిగింది. ఈ ఘర్షణలో దుండగులు రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్పై ఆయుధాలతో దాడి చేశారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతిపై, దుండగుల వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ని నోట్ చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవీందర్ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా చనిపోయే ముందు రవీందర్ చూపిన సమయస్ఫూర్తిపై పోలీసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీనిపై హరియాణా చీఫ్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. ”చనిపోయే ముందు మా పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ సింగ్ చూపిన సమయస్ఫూర్తి నిజంగా అభినందించాల్సిన విషయం. పోస్టుమార్టం సమయంలో రవీందర్ సింగ్ తమకు క్లూ ఇచ్చిన విషయం తెలిసింది. కేసు దర్యాప్తులో ఈ క్లూ చాలా సాయం చేసింది. లేదంటే నిందితులను పట్టుకోవడం అంత సులవైన పని అయ్యేది కాదు” అని అన్నారు. కాగా ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా.. వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.