ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఆ ఐదు జిల్లాల్లో హై-అలెర్ట్.!
ఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతున్న నేపధ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది.
Heavy Rains In AP: ఏపీలో అల్పపీడన ద్రోణీ కొనసాగుతున్న నేపధ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. సముద్రంలో 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఆదివారం: విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రాష్ట్రంలోని మిగిలిన అన్ని చోట్లా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం: విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన అన్ని చోట్లా మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు విపత్తుల శాఖ తెలిపింది.
మంగళవారం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ వెల్లడించింది.