తలకు బలమైన గాయం వల్లే మనోజ్ఞ చనిపోయింది.. పోస్ట్మార్టం రిపోర్ట్
గుంటూరులో జరిగిన మనోజ్ఞ ఆత్మహత్య కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. తలకు బలమైన గాయం కావడం వల్లే మనోజ్ఞ చనిపోయినట్టు జీజీహెచ్ అధికారులు నివేదిక ఇచ్చారు.
గుంటూరులో జరిగిన మనోజ్ఞ ఆత్మహత్య కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. తలకు బలమైన గాయం కావడం వల్లే మనోజ్ఞ చనిపోయినట్టు జీజీహెచ్ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే, ఆత్మహత్య చేసుకుందని భర్త చెప్పడం, కాదు హత్య చేసి భర్తే కింద పడేశాడని మనోజ్ఞ పేరెంట్స్ ఆరోపించడంతో మనోజ్ఞ మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలేనికి చెందిన నేవీ ఉద్యోగి కళ్యాణ్ చంద్రకి పంగులూరుకి చెందిన మనోజ్ఞ తో మూడేళ్ల కిందట వివాహమైంది. ఎంటెక్ చదివిన మనోజ్ఞ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. వివాహ సమయంలో భారీగానే కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత దంపతులు హైదరాబాద్లోని యూసుఫ్గూడలో కాపురం పెట్టారు. వారికి తొమ్మిది నెలల కిందట కూతురు తులసి పుట్టింది.
భర్త నేవీ ఉద్యోగం కావడంతో డ్యూటీకి వెళ్లిన సమయంలో అత్తమామలు ఇంటికి వచ్చేవారు. గత జనవరిలో మనోజ్ఞ దంపతులు గుంటూరులోని అత్తమామల ఇంటికి వచ్చేశారు. అప్పటి నుంచి నగరంలోని కమలేష్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలం నుంచి అత్తమామలు, భర్త వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. దీంతో మనోజ్ఞ దారుణ నిర్ణయం తీసుకుంది. బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్తే చంపేసి, కింద పడేశాడని మనోజ్ఞ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో తలకు బలమైన గాయం కావడం వల్లే మనోజ్ఞ మృతి చెందినట్టు నివేదికలో ఉంది. దీంతో గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.