ఆస్తి కోసం నాయనమ్మను నిప్పంటించి చంపిన మనవడు
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తి కోసం సొంత నాయనమ్మను తగులబెట్టాడు ఓ కసాయి మనవడు. రంగారెడ్డి జిల్లా లో జరిగిన ఈ ఘటన అందరిని తీవ్రంగా కలచివేసింది. అయితే, ఈ ఘటనకు పాల్పడింది మైనర్ కావడం విశేషం.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తి కోసం సొంత నాయనమ్మను తగులబెట్టాడు ఓ కసాయి మనవడు. రంగారెడ్డి జిల్లా లో జరిగిన ఈ ఘటన అందరిని తీవ్రంగా కలచివేసింది. అయితే, ఈ ఘటనకు పాల్పడింది మైనర్ కావడం విశేషం.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఎలవర్తి గ్రామంలో దారుణం జరిగింది. అస్తిలో కొంత భాగాన్ని తమ అత్తలకు పంచివేసిందని సొంత నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడు మనువడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శంకర్ పల్లి సిఐ గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఎలవర్తికి చెందిన కంసమ్మకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. అయితే, తనకున్న ఆస్తిలో కొడుకుతో పాటు ముగ్గరు బిడ్డలకు సమాన భాగాలు చేసి పంచి ఇచ్చింది. దీంతో తల్లి, కొడుకుల మధ్య తరుచు గొడవలు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న విషయాన్ని పదో తరగతి చదువుతున్న మనవడు శివకుమార్ గమనిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం మధ్యహ్నాం నాయనమ్మతో గొడవకు దిగిన శివకుమార్ ఒక్కసారిగా దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడని సీఐ గోపినాథ్ తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కంసమ్మ అక్కడిక్కడే మృతిచెందిందని సీఐ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్ పల్లి పోలీసులు. పరారీలో ఉన్న మనవడు శివకుమార్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.