బెంగాల్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
పశ్చిమ బెంగాల్ లో మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా పాకింది. వారికి సంఘీభావంగా అనేక రాష్ట్రాల్లో వేలాది డాక్టర్లు విధులకు స్వస్తి చెప్పి.. సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వీరి సమ్మెతో వైద్య సర్వీసులకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రి వద్ద డాక్టర్లు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నోటికి […]
పశ్చిమ బెంగాల్ లో మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా పాకింది. వారికి సంఘీభావంగా అనేక రాష్ట్రాల్లో వేలాది డాక్టర్లు విధులకు స్వస్తి చెప్పి.. సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వీరి సమ్మెతో వైద్య సర్వీసులకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రి వద్ద డాక్టర్లు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, తలకు హెల్మెట్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగున్నర వేలమంది డాక్టర్లు వైద్య సర్వీసులను నిలిపివేశారు. బెంగాల్ లో ఈ నెల 10 న ఓ ఆస్పత్రిలో ఒక డాక్టర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ.. తమకు ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రారంభించారు. అయితే వీరి డిమాండును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పట్టించుకోకపోగా.. వారికి అల్టిమేటం జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా వారు తిరిగి విధులకు హాజరు కాకపోతే హాస్టళ్ల నుంచి వారిని ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ ను డాక్టర్లు పెడచెవిన పెట్టి సమ్మె కొనసాగించారు. బీజేపీ, సీపీఎం పార్టీలు వీరిని రెచ్చగొడుతున్నాయని, హిందూ-ముస్లిం రాజకీయాలకు పాల్పడుతున్నాయని దీదీ ఆరోపించారు. కాగా-డాక్టర్ల సమ్మెకు సంఘీభావం తెలిపిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), దేశవ్యాప్తంగా వైద్యులంతా వీరికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. జూనియర్ డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు కేంద్ర స్థాయిలో చట్టం తేవాలని ఈ సంస్థ ప్రధాని మోదీని, హోమ్ మంత్రి అమిత్ షానికోరింది. అయితే అత్యవసర సేవలకు అంతరాయం కలగడం లేదని ఐఎంఏ వెల్లడించింది.
ఇదిలా ఉండగా..కేంద్ర మంత్రి హర్ష వర్ధన్.. బెంగాల్ లో డాక్టర్ల సమ్మె పట్ల మమతా బెనర్జీ చూపుతున్న ఉదాసీనతను ఖండించారు. దీన్ని ప్రిస్టేజీ ఇష్యుగా తీసుకోరాదని కోరారు. ఇప్పటికైనా ఆమె మంకుపట్టు వీడి.. జూనియర్ డాక్టర్ల డిమాండును సానుకూలంగా పరిశీలించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సమస్యను రాజకీయం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.