విశ్వగురువుగా భారత్ : గవర్నర్ తమిళిసై
జాతీయ విద్యా విధానం-2020 సమర్ధవంతమైన అమలుతో భారత్ విశ్వగురువుగా అవతరిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ మూలాల ఆధారంగా ఆధునిక ప్రపంచ అవసరాలకనుగుణంగా రూపొందిన ఈ జాతీయ విద్యావిధానంతో విద్యా రంగంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతుందన్న...
జాతీయ విద్యా విధానం-2020 సమర్ధవంతమైన అమలుతో భారత్ విశ్వగురువుగా అవతరిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ మూలాల ఆధారంగా ఆధునిక ప్రపంచ అవసరాలకనుగుణంగా రూపొందిన ఈ జాతీయ విద్యావిధానంతో విద్యా రంగంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గవర్నర్. విద్యాభారతి సంస్ధ ఈ నూతన విద్యా విధానంపై విద్యార్ధులలో అవగాహన పెంచడానికి వారిని చైతన్యవంతం చేయడానికి ‘ మైఎన్ఈపీ ’ కార్యక్రమం ద్వారా పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని గవర్నర్ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం రూపకర్తలైన ప్రముఖ సైంటిస్టు డా. కస్తూరి రంగన్ ఇతరసభ్యులు విద్యా రంగంలో భారత్కు ప్రాచీన కాలం నుంచి ఉన్నగొప్ప పేరును, వైభవాన్ని తిరిగి సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఎన్ఈపీ-2020 ప్రవేశ పెట్టారని గవర్నర్ వివరించారు. విద్యా రంగంలో మౌలికమైన , సమూల మార్పుల ద్వారా ఆధునిక సాంకేతిక యుగానికి సంబంధించి వివిధ రంగాల్లో భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడుతుందని అన్నారు. భారత్ను విజ్ఞాన ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చడం , నాలెడ్జ్ సూపర్ పవర్గా తీర్చిదిద్దడం అన్నస్పష్టమైన లక్ష్యాలతో వచ్చిన ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని సమర్ధవంతమైన అమలు కోసం అందరూ భాగస్వాములు కావాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు.