కరోనాకు ‘గుడ్ బై’..ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన చైనా
కరోనా వైరస్ తో సుమారు 197 దేశాలు అల్లల్లాడుతుండగా.. ఈ విలయానికి మూలకారణమైన చైనా మాత్రం కరోనాకు గుడ్ బై చెబుతోంది. ఈ మహమ్మారిని అదుపు చేయడంలో సఫలీకృతమైన చైనా.. ముఖ్యంగా హుబీ ప్రావిన్స్ లో ప్రయాణాలపై గల ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. గత డిసెంబరు రెండో వారం నుంచి వూహాన్ సిటీ, ఆ తరువాత హుబీ ప్రావిన్స్ లో కాలు పెట్టిన కరోనా.. ప్రభుత్వం చేబట్టిన కఠిన చర్యల కారణంగా…. దాని ఛాయలు క్రమేపీ […]
కరోనా వైరస్ తో సుమారు 197 దేశాలు అల్లల్లాడుతుండగా.. ఈ విలయానికి మూలకారణమైన చైనా మాత్రం కరోనాకు గుడ్ బై చెబుతోంది. ఈ మహమ్మారిని అదుపు చేయడంలో సఫలీకృతమైన చైనా.. ముఖ్యంగా హుబీ ప్రావిన్స్ లో ప్రయాణాలపై గల ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. గత డిసెంబరు రెండో వారం నుంచి వూహాన్ సిటీ, ఆ తరువాత హుబీ ప్రావిన్స్ లో కాలు పెట్టిన కరోనా.. ప్రభుత్వం చేబట్టిన కఠిన చర్యల కారణంగా…. దాని ఛాయలు క్రమేపీ కనుమరుగయ్యాయి. ఈ వ్యాధికి సంబంధించి కొత్త కేసులేవీ లేకపోవడంతో.. ముఖ్యంగా ఈ ప్రావిన్స్ లో ప్రయాణ సంబంధ ఆంక్షలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యవంతులైన ప్రజలు నిరభ్యంతరంగా ప్రయాణించవచ్ఛునని వారు ప్రకటించారు. తమ ఇళ్ల లోనే ఉండవలసిందిగా రెండు నెలల క్రితమే ప్రజలను ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. ఇక ఈ ఆంక్షల ఎత్తివేత ప్రకటనపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వూహాన్ సిటీలో మాత్రం ఏప్రిల్ 8 వరకు ఇవి అమల్లో ఉంటాయి.
అటు-బ్రిటన్, అమెరికా, నార్త్ అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలు లాక్ డౌన్ల మధ్య నలుగుతుండగా.. చైనా మాత్రం దాదాపు పూర్తిగా కోలుకొంటుండడం గమనార్హం. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా సోకిన వృధ్ధ రోగులను గాలికి వదిలేస్తున్నారు. వారికి చికిత్సలు చేసేందుకు డాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. అమెరికాలోని న్యూయార్క్ సిటీ నిర్మానుష్యంగా మారిన దృశ్యాన్ని చూసిన ఓ సైకాలజిస్టు ..కరోనాకు గురైన ప్రతి రోగికీ.. ఆ తరువాత మానసిక దౌర్బల్యం తప్పకపోవచ్ఛునని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి రోగులను అలాగే వదిలేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించాలని ఆమె అన్నారు. ఇక బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్.. ఇద్దరికంటే ఎక్కువమంది గుమికూడితే.. వారిని వారి ఇళ్ల నుంచి పంపివేస్తామని హెచ్చరించారు. మూడువారాలపాటు షాపులన్నీ మూసివేయాలని ఆదేశించారు. కాగా-ఇటలీలో తాజాగా ఒక్క కరోనా కేసు కూడా బయటపడకపోవడం కాస్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. శనివారం నాటికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆరున్నర వేలకు చేరింది. ఆది. సోమవారాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం తెలిపింది.