ఎయిర్పోర్టులో కోట్లు విలువ చేసే బంగారం, వారికి బిగుస్తోన్న ఉచ్చు
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన దాదాపు 8 కిలోల బంగారం, ఇతర విలువైన వస్తువులున్న బాక్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన దాదాపు 8 కిలోల బంగారం, ఇతర విలువైన వస్తువులున్న బాక్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కార్గో విమానంలో జైపూర్, ముంబైకు తరలిస్తున్న పెట్టెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.37 కిలోల బంగారు బిస్కెట్లు, 5.63 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, స్టెయిన్లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్తోపాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 6,62,46,387 ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో వీటిని తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. బాక్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడకు చెందిన ఏడుగురు వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు. విదేశీ అక్రమ బంగారం కోణంతో పాటు పన్ను ఎగవేత, జీఎస్టీ అంశాలపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కొరియర్ ఏజెన్సీలు హైదరాబాద్, విజయవాడలోని ఏడుగురు వ్యాపారులు ఆ బాక్సులు పంపినట్లుగా సమాచారం ఇచ్చాయి. ( ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..? )
మెహదీపట్నం, సికింద్రాబాద్ చెందిన వ్యాపారులను కస్టమ్స్ అధికారులు ప్రశ్నించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇద్దరు వ్యాపారులు బంగారం కొనుగోలుకు సంబంధించి బిల్లులు చూపించనట్టు సమాచారం. వారు విదేశీ బంగారాన్ని రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విజయవాడకు చెందిన కొద్దిమంది వ్యాపారుల ప్రమేయాన్ని కూడా పోలీసులు ధృవీకరించారు. జీఎస్టీ, ఐటీ శాఖల అధికారులు కస్టమ్స్ అధికారుల నుంచి కేసు వివరాలను సేకరించారు. ( రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )