పుస్తెలమ్మినా..పులస దొరకనంటోంది..!

ఆంధ్ర మాత-గోంగూర, బందర్‌ – లడ్డు, కాకినాడ – కాజ, హైదరాబాద్‌ – బిర్యానీ ఇలా స్వీటు, హాటు ఫుడ్డుకు ఒక్కో ప్రాంతం ప్రసిద్ది. ఇక చేపల్లో మహారాణి ఎవరంటే మాత్రం ఖచ్చితంగా అందరూ “పులస’ కే జై కొడతారు. అయితే, ఈ పులస ఎక్కడ పడితే అక్కడ దొరకదు.. కేవలం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి నది పాయల్లోనే దొరుకుతుంది. చేప దొరికిందా..దాన్ని దక్కించుకోవటానికి యానం నుంచి ఆంధ్రా వరకు యావత్‌ మత్స్యప్రియులు అల్లాడి పోతుంటారు. పుస్తెలు […]

పుస్తెలమ్మినా..పులస దొరకనంటోంది..!
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 12:36 PM

ఆంధ్ర మాత-గోంగూర, బందర్‌ – లడ్డు, కాకినాడ – కాజ, హైదరాబాద్‌ – బిర్యానీ ఇలా స్వీటు, హాటు ఫుడ్డుకు ఒక్కో ప్రాంతం ప్రసిద్ది. ఇక చేపల్లో మహారాణి ఎవరంటే మాత్రం ఖచ్చితంగా అందరూ “పులస’ కే జై కొడతారు. అయితే, ఈ పులస ఎక్కడ పడితే అక్కడ దొరకదు.. కేవలం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి నది పాయల్లోనే దొరుకుతుంది. చేప దొరికిందా..దాన్ని దక్కించుకోవటానికి యానం నుంచి ఆంధ్రా వరకు యావత్‌ మత్స్యప్రియులు అల్లాడి పోతుంటారు. పుస్తెలు అమ్మి అయినా ..పులస తినాలనే నానుడి ఏర్పడిందంటే.. ఆ చేప ప్రత్యేకత ఎంత అనేది మనం అంచనా వేయవచ్చు. ఇక ఈ సారి సీజన్‌లో పుస్తెలమ్మీనా పులస దొరికేలా లేదంటున్నారు మత్స్యప్రియులు.

కేవలం ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో మాత్రమే, అది గోదావరి నదిలో మాత్రమే దొరికే అరుదైన చేప పులస. గోదావరి వరద నీరు బంగాళాఖాతంలోకి పారుతున్నవేళ ఎర్రటి వరద నీటిలో గుడ్లు పెట్టడానికి ఈ పులస చేపలు ఈదుతూ ఎదురు వస్తుంటాయి. గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి, గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండు రోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చే సరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలా కేవలం ఈ సీజన్‌లో మాత్రమే..అది కూడా గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌ మధ్యలోనే ఇవి దొరుకుతాయి.

అయితే, ఇప్పుడు గోదావరి వాసులకు సైతం పులస అరుదైన చేపగా కనిపిస్తుంది. కేజీ బేసీన్‌లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌ వంటి కారణాల వల్ల వీటి రాక తగ్గుంతుందని చెబుతున్నారు. అడవులు తగ్గిపోయి, లంక భూములు కోతకు గురికావడంతో పులసలు పునరుత్పత్తి చేయలేకపోతున్నాయి. మరోవైపు కోటిపల్లి- యానంకు సంబంధించి రైల్వే పనుల కారణంగా క్రాస్‌ బండ్‌ వేయటంతో బొబ్బర్లంక ప్రాంతాలకు పులసలు దొరకని పరిస్థితి..దీంతో ప్రస్తుతం కేజీ పులస రూ. 15 వేలు దాటి అమ్ముడవటానికి కారణం అంటున్నారు ఇరిగేషన్‌ శాఖ అధికారులు. బంగ్లాదేశ్‌లో పద్మానది, బెంగాల్‌లో హుగ్లీ, ఎపీలోని గోదావరి ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే పులస చేపలు దొరుకుతాయి. మిగిలిన ప్రాంతాల్లో హిల్సా , ఇలస పేర్లతో పిలవబడే ఈ చేపలు ఏపీలో పులసగా పేరొందాయి.