Godavari Boat Accident : గోదారమ్మా!..ఆ తల్లి వేదన నీకు వినిపిస్తుందా?
గోదావరి నీటి పరవళ్లు..చుట్టూ పక్షుల కేరింతలు. పడవలో తమ కుమార్తె నృత్యం చేస్తుంటే..ఆ పాపను చూసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. మరి ఆ ఆనందం చూసి దేవుడికి కన్ను కుట్టిందో ఏమో తెలీదు కానీ..ఆ పాపను కొన్ని క్షణాల్లోనే జలగర్భంలో కలిపేశాడు. కూతుర్ని కాపాడబోయి తండ్రి కూడా నీటిలో కలిసిపోయాడు. అదృష్ణవశాత్తు ప్రాణాలు కాపాడుకున్న పాప తల్లి మోహంలో ఇప్పుడు కన్నీటి సంద్రమే ప్రవహిస్తుంది. తిరుపతి అక్కారం పల్లికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం… […]
గోదావరి నీటి పరవళ్లు..చుట్టూ పక్షుల కేరింతలు. పడవలో తమ కుమార్తె నృత్యం చేస్తుంటే..ఆ పాపను చూసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. మరి ఆ ఆనందం చూసి దేవుడికి కన్ను కుట్టిందో ఏమో తెలీదు కానీ..ఆ పాపను కొన్ని క్షణాల్లోనే జలగర్భంలో కలిపేశాడు. కూతుర్ని కాపాడబోయి తండ్రి కూడా నీటిలో కలిసిపోయాడు. అదృష్ణవశాత్తు ప్రాణాలు కాపాడుకున్న పాప తల్లి మోహంలో ఇప్పుడు కన్నీటి సంద్రమే ప్రవహిస్తుంది.
తిరుపతి అక్కారం పల్లికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం… కుటుంబంతో కలిసి వినాయక్ సాగర్ రాధేశ్యాం అపార్ట్ మెంట్స్లో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా… మధులత గృహిణి. చిన్నారి హాసినీ స్థానిక స్ర్పింగ్ డేల్ స్కూల్ ఏడో తరగతి చదువుతోంది. ఐదు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం తన భార్య మధులత, 12ఏళ్ల కుమార్తె హాసినితో కలిసి సుబ్రహ్మణ్యం పాపికొండలకు వెళ్లారు.
కానీ అక్కడ వారిని విధి వెంటాడింది. పడవ ప్రమాదంలో దుర్గం సుబ్రహ్మణ్యం కుటుంబం నీటిలో మునిగిపోయింది. సుబ్రహ్మణ్యం భార్య మధులతను స్థానికులు కాపాడి మరో బోటులో తరలించగా….సుబ్రహ్మణ్యం, చిన్నారి హాసిని మాత్రం నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. రంపచోడవరం ఆసుపత్రికి మధులతను చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ తన గారాలపట్టి హాసిని, భర్త సుబ్రహ్మణ్యం కోసం ఆమె పడుతున్న వేదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
రంపచోడవరం ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి కన్నబాబు..మధులతను పరామర్శించగా..ఘటన జరిగిన వైనాన్ని ఆమె మంత్రికి వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పడవ బోల్తా పడిన వెంటనే తన చిన్నారి కూతురు తన కాళ్లను పట్టుకునే వేలాడుతున్నా…కాపాడుకోలేకపోయానని గుండెలు అవిసేలా రోదించారు. పడవ బోల్తా పడిన వెంటనే అప్రమత్తమైన తన భర్త సుబ్రహ్మణ్యం నీటిలో మునిగిపోతున్న చిన్నారి హాసినీని, తనను నీటి పైకి నెట్టి కాపాడినా సుబ్రహ్మణ్యం మాత్రం కళ్లముందే నీటిలోకి మునిగిపోయారంటూ మధులత పడుతున్న బాధ వర్ణనాతీతం. తన భర్త అంత ప్రయత్నించి …చిన్నారి హాసినీని పైకి నెట్టినా…తను మాత్రం కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తిరుపతి అక్కారంపల్లిలోని మధులత నివాసం ఉంటున్న కాలనీలో విషాద వాతావరణం కనిపిస్తోంది. ఆడుతూ పాడుతూ తమ ముందే తిరిగే హాసినీ…..అందరితో కలివిడిగా ఉండే సుబ్రహ్మణ్యం ప్రమాదంలో గల్లంతు అవడాన్ని బంధువులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.