జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అఖిలపక్ష భేటీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కసరత్తు చేస్తోంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అఖిలపక్ష భేటీ
Follow us

|

Updated on: Nov 12, 2020 | 11:44 AM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కసరత్తు చేస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు. గ్రేటర్ ఎన్నికలు ఈవీఎంలతోనా? బ్యాలెట్‌‌తోనా? అభిప్రాయం తెలపాలంటూ లేఖలో పేర్కొన్నారు.  దీపావళి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.  నేపథ్యంలో  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉన్నతాధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా, తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ వంటి అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్చించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ముసాయిదాను జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిపై అయా పార్టీల అభ్యంతరాలపై కూడా చర్చ జరుగనుంది.

అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారథి విడివిడిగా భేటీ కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్కో పార్టీకి 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై అన్ని పార్టీల నేతలతోనూ చర్చించనున్నారు. పోటీ చేసే అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన డిపాజిట్ సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చించనున్నట్లు సమాచారం.