గ్రేటర్ ఎన్నికలపై సమీక్ష.. ఎన్నికల నిర్వహణపై పరిశీలకు ఈసీ పార్థసారథి దిశనిర్ధేశం..
గ్రేటర్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే బాధ్యత ఎన్నికల పరిశీలకులదేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి అన్నారు.
గ్రేటర్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే బాధ్యత ఎన్నికల పరిశీలకులదేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయా జోన్ల వారిగా ఆరుగురు ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు ఆయన చెప్పారు. ఒక్కో జోన్కు ఇద్దరు చొప్పున పరిశీలకుల నియామకం. ఎన్నికలు పూర్తయ్యేలోగా పరిశీలకులు ఐదుసార్లు నివేదికలు ఇవ్వాలని ఆయన సూచించారు. పోలింగ్, కౌంటింగ్ రోజు ఇచ్చే నివేదికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. పరిశీలకుల నివేదికల ఆధారంగా పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 150 డివిజన్లకు గానూ వివిధ పార్టీల నుంచి 1,421 మంది అభ్యర్థులు 1,889 నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్క్రూట్నీ నిర్వహించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.