ఆధార్తో మీ మొబైల్ నెంబర్ లింక్ అయిందా చూసుకోండి.. లేదంటే రేషన్ సరుకులు కట్.. ఫిబ్రవరి నుంచి కొత్త పద్దతిలో..
తెలంగాణలో రేషన్ సరుకులు పొందేవారికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి
తెలంగాణలో రేషన్ సరుకులు పొందేవారికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చౌకధరల దుకాణాలకు అదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ అయిందో కాలేదో చూసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.
రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) చెప్పాల్సిందే. లేదంటే ఐరీస్ విధానం ద్వారా మాత్రమే రేషన్ అందజేస్తారు. గతంలో బయోమెట్రిక్ లో వేలిముద్ర వేసిన తర్వాతే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇక నుంచి ఆ అవసరం లేదని, ఫోన్కి వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆహార భద్రత కార్డులో ఉన్న ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ జిరాక్స్ కాపీని సంబంధిత డీలర్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా ఫిబ్రవరి నెల నుంచి ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉండనుంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో 30 శాతం మంది లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఆధార్ తో లింకు కాలేదని సమాచారం. వారందరికీ ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.