గట్టెక్కిన గెహ్లాట్.. ఇక జగన్ బాటలో పైలట్ !
రాజస్థాన్ శాసనసభలో తనకు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉందని మంగళవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయన చాటుకున్నారు. దాంతో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖరారైంది. మరి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉపముఖ్యమంత్రి, యువ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ భవితవ్యం ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాలుగైదు రోజులుగా యమా రంజుగా కనిపించిన రాజస్థాన్ రాజకీయం మంగళవారం ఓ కొలిక్కి వచ్చింది. రెండు విడతలుగా జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ శాసనసభలో తనకు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉందని మంగళవారం జరిగిన శాసనసభా పక్షం భేటీలో ఆయన చాటుకున్నారు. దాంతో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖరారైంది. మరి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉపముఖ్యమంత్రి, యువ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ భవితవ్యం ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక దశలో బీజేపీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సచిన్ పైలెట్ సమాయత్తం అవుతున్నట్లు కనిపించింది. కానీ సచిన్ పైలెట్ను భుజానికెత్తుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధపడకపోవడం.. దానికి తోడు సచిన్ పైలెట్ బీజేపీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టుకొని భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని భావించడంతో తిరుగుబాటు బావుటా చివరికి ఎదురుదెబ్బ మారుతున్న పరిస్థితికి చేరింది.
తాజాగా మంగళవారం రెండోసారి జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష భేటీలో అశోక్ గెహ్లాట్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం తో ఇప్పుడు సచిన్ పైలెట్ రెంటికి చెడ్డ రేవడిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 104 మంది అశోక్ గెహ్లాట్కు మద్దతుగా నిలవగా అదే సీఎల్పీ సమావేశంలో సచిన్ పైలెట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి నివేదస్తూ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దానికి తోడు నిన్న సచిన్ పైలెట్ వెంట నిలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీకి హాజరువడం మరో ఆసక్తికరమైన పరిణామం.
మంగళవారం ఉదయం సచిన్ పైలెట్ను బుజ్జగించేందుకు పార్టీ అధినాయకత్వం అంటే స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరా లాంటి వారు కూడా రంగంలోకి దిగారు. అయితే వారిద్దరి బుజ్జగింపులకు సచిన్ పైలెట్ మెత్తబడలేదన్న కథనాలు జాతీయ మీడియాలో కనిపించాయి. తీరా సీఎల్పీ భేటీ ప్రారంభం అయ్యే సరికి సచిన్ పైలెట్ వర్గానికి సంబంధించిన కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశంలో కనిపించారు. దాంతో సచిన్ పైలెట్ మెత్తబడ్డారా లేక ఆ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవడంలో పార్టీ అధిష్టానం సఫలీకృతం అయిందా అనేది చర్చనీయాంశంగా మారింది.
అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేల బలం పొందిన అశోక్ గెహ్లాట్… ఆ వెంటనే సచిన్ పైలట్పై చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆయన్ను వదులుకునేందుకే పార్టీ అధినాయకత్వం సిద్దమైందని అర్థం చేసుకోవచ్చు. సీఎల్పీ భేటీ తర్వాత సచిన్ పైలట్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను కూడా ముఖ్యమంత్రి తొలగించారు. ఈ మేరకు గవర్నర్కు గెహ్లాట్ పంపిన నోట్ ఆ వెంటనే ఆమోదం పొందింది. వీరి పదవులు ఊడిపోయాయి. అదే సమయంలో అధిష్టానం కూడా సచిన్ పైలట్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించింది. అంటే పరోక్షంగా ఆయనకు బయటికి పంపేందుకు రంగం సిద్దం చేసినట్లే కనిపిస్తోంది.
మరో వైపు పార్టీలో చేరతాడనుకున్న సచిన్ పైలట్ సొంత పార్టీ అనడంతో కమలనాథులు కూడా ఆయన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీలో చేరితే మధ్య ప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాకు ఇచ్చిన విధంగానే రాజస్థాన్లో సచిన్ పైలెట్కు గౌరవం ఇద్దామని కమలనాథులు తొలుత భావించారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సచిన్ పైలెట్కు మంత్రి పదవి దక్కేది. కానీ బీజేపీలో చేరకుండా ప్రత్యేక ఎజెండాతో సొంత పార్టీ పెట్టుకునేందుకు సచిన్ పైలెట్ సిద్ధమవడం కమలనాథులకు నచ్చని విషయంగా మారింది.
ఒక రకంగా చెప్పాలంటే ఇపుడు సచిన్ పైలెట్ ఆంధ్ర రాజకీయాలను ప్రస్తుతం శాసిస్తూ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలో భవిష్యత్ రాజకీయానికి సిద్ధపడ్డతారని చెప్పవచ్చు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే రాజస్థాన్లో రాజేష్ పైలెట్ కూడా పేరున్న నేత. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియాగాంధీ సుముఖంగా లేకపోవడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకుని సుమారు పదేళ్ళపాటు సొంతంగా రాజకీయ దిగ్గజంగా నిలిచేందుకు పోరాడారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్పై చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. బీజేపీలో చేరి వెంటనే కాంగ్రెస్ పార్టీపై పగ తీర్చుకోవడమో లేక ప్రత్యేక పార్టీ పెట్టి సుదీర్ఘ రాజకీయ పోరాటానికి సిద్దపడడమో… ఈ రెండు మార్గాలు ఇపుడు యువ పైలట్ ముందున్నాయి.
నిజానికి తన తండ్రి, దివంగత రాజేష్ పైలెట్ తరహాలోనే కులసమీకరణలు మార్చడం ద్వారా సచిన్ పైలట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబట్టారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రధాన కుల సమీకరణలపై తనదైన శైలిని ప్రదర్శించేవారు రాజేశ్ పైలట్. ముఖ్యంగా రాజస్థాన్లో కీలక కులాలైన గుజ్జర్లు, మీనాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో రాజేష్ పైలెట్ చాతుర్యాన్ని ఎవరూ మరిచిపోలేరు. అదే తరహా చాతుర్యాన్ని రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు సచిన్ పైలెట్. గత ఎన్నికల సందర్భంగా గుజ్జర్లను, మీనాలను ఏకం చేయడంలో విజయవంతమయ్యారు. అందుకే ఈశాన్య రాజస్థాన్ ప్రాంతంలోని 49 అసెంబ్లీ స్థానాలకు గాను 42 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది.
తాజాగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి తాను అనుకున్నది సాధించలేక పోయిన సచిన్ పైలెట్ భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను రచిస్తారన్నది అనేది చూడాల్సి ఉంది. ఇక సచిన్ పైలెట్ వెనుదిరిగి చూడకుండా సొంత పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీజేపీ.. సచిన్ పైలెట్ను నేరుగా టార్గెట్ చేయకుండా.. ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు ఉపయోగించుకోవచ్చు. సచిన్ పైలెట్తో కలిసి పనిచేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
మొత్తానికి తాజా పరిణామాలలో పైచేయి సాధించిన అశోక్ గెహ్లాట్కు భవిష్యత్తు ముళ్ళబాటేనని చెప్పాలి. ఒక వైపు బీజేపీ.. ఇంకో వైపు సచిన్ పైలెట్ రూపంలో ముప్పు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అసలే అత్తెసరు మెజారిటీ.. దానికితోడు సచిన్ ముప్పు.. కమలనాథుల వ్యూహాలు.. వెరసి గెహ్లాట్ అయిదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం పెద్ద సవాలేనని చెప్పాలి.