ఏపీలో ఉచిత సరుకుల పంపిణీ.. ఎప్పట్నుంచి అంటే
లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు ప్రజలు నిత్యావసరాల కోసం కష్టాలు పడకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. దానికోసం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఉచితంగా సరుకు పంపిణీ ..
కరోనా కోరల్లోంచి తప్పించుకునేందుకు యావత్ భారతావని యుద్ధం చేస్తోంది. కోవిడ్ దాటికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. సామాజిక దూరం పాటిస్తూ..కంటికి కనిపించని శత్రువుగా మారిన వైరస్తో ప్రజలు పోరాటం చేస్తున్నారు. మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు ప్రజలు నిత్యావసరాల కోసం కష్టాలు పడకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. దానికోసం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఉచితంగా సరుకు పంపిణీ చేపట్టింది ప్రభుత్వం.
లాక్డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా రేషన్ సరకులను అందజేస్తుంది. ఇప్పటికే మొదటి విడత సరుకులను పంపిణీ చేయగా, రెండో విడతకు సంబంధించిన రేషన్ సరుకులను ఈనెల 15 నుంచి పంపిణీ చేయనున్నారు. సరుకుల పంపిణీకి సంబంధించిన కూపన్లను ముందుగా వాలంటీర్ ద్వారా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి అందించనున్నారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కూపన్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల సరుకుల కోసం రేషన్ దుకాణాల్లో ఏలాంటి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. దీంతో రేషన్ షాపుల్లో ఏలాంటి రద్దీ ఉండే అవకాశం లేదు. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.