వరద బాధితులకు బాసటగా జగన్ సర్కార్.. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ..
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
Flood Victims In AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
అంతేకాదు తీవ్ర పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనితో వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళాదుంపలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు.