కరోనాను జయించిన నాలుగు నెలల శిశువు
చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్కి 26దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచమే వణికిపోతున్న ఈ కరోనాను ఓ నాలుగు నెలల చిన్నారి జయించింది. చైనాకు చెందిన 4 నెలల శిశువుకి ఇటీవల కరోనా వైరస్..
చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్ ధాటికి 26దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తోన్న కరోనాను ఓ నాలుగు నెలల చిన్నారి జయించింది. చైనాకు చెందిన ఓ తల్లికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెతో పాటు 4 నెలల శిశువుకి ఇటీవల కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో.. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో ఆ చిన్నారికి చికిత్స అందించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 18,254 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఎన్నో దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా వైరస్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్-19’ అని పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్ను, డీ అక్షరం డిసీజ్ ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.