బెంగుళూరు.. గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ మృతి
బెంగుళూరులో ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు తేలిన గురు రాఘవేంద్ర బ్యాంకు మాజీ సీఈఓ ఎం.వాసుదేవ్ మయ్యా మృత దేహాన్ని ఆయన ఇంటి బయట కనుగొన్నారు. ఆయన ఎలా మరణించాడు, ఇందుకు కారణాలేమిటన్న..
బెంగుళూరులో ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు తేలిన గురు రాఘవేంద్ర బ్యాంకు మాజీ సీఈఓ ఎం.వాసుదేవ్ మయ్యా మృత దేహాన్ని ఆయన ఇంటి బయట కనుగొన్నారు. ఆయన ఎలా మరణించాడు, ఇందుకు కారణాలేమిటన్న దానిపై పోలీసులు తెలియజేయలేదు. ఈ బ్యాంకులో రూ. 1400 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న కారణంపై రిజర్వ్ బ్యాంక్ గత జనవరిలోదీనిపై దర్యాప్తు చేపట్టింది. ఆరు నెలల వరకు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రతి ఖాతాదారునికీ రూ. 35 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో.. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ వందలాది డిపాజిటర్లు గత నెలలో తమ సొమ్ము తీసుకునేందుకు ఈ బ్యాంకు బ్రాంచీల ముందు క్యూలు కట్టారు. వీరిలో అత్యధికులు సీనియర్ సిటిజన్లే ఉన్నారు.వాసుదేవ్ మయ్యా పై గత జనవరిలోనే చీటింగ్, ఫోర్జరీ కేసు దాఖలు కావడంతో ఆయనను సీఈఓ పదవి నుంచి తొలగించారు. బ్యాంకులో జరిగిన ఆర్ధిక అవకతవకలపై ఆర్ బీ ఐ ఓ అడ్మినిస్ట్రేటర్ ని కూడా నియమించింది. గత నెలలో వాసుదేవ్ ఇంటిపైన, కార్యాలయం పైన అధికారులు దాడులు నిర్వహించారు.