ఢిల్లీలో బర్ద్ ఫ్లూ తొలి కేసు, జూలో మరణించిన గుడ్లగూబ, శాంపిల్స్ లో తేలిన పాజిటివ్ లక్షణాలు, జూ మూసివేత
ఢిల్లీలో తొలి బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది..
ఢిల్లీలో తొలి బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ల్యాబ్ కు పంపగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చినట్టు జూ డైరెక్టర్ రమేష్ పాండే తెలిపారు. ఢిల్లీ లోని ల్యాబ్ కూడా దీన్ని ధృవీకరించిందన్నారు. భోపాల్ లోని ఐసీఎఆర్ నేషనల్ ఇన్స్ టిట్యూట్..ఆర్ టీ పీసీఆర్ టెస్టులను నిర్వహించిందని, ఈ ఫలితాలను తాము ఢిల్లీ ల్యాబ్ కు పంపామని ఆయన చెప్పారు. ఇటీవల నగరంలోని కొన్ని పార్కుల్లో మరణించిన కొన్ని కాకులు, బాతుల శాంపిల్స్ ను కూడా భోపాల్ లోని ల్యాబ్ కే పంపగా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు పాండే వివరించారు. అయితే నగరంలోని పోల్ట్రీ ఫారాల్లో కోళ్ల శాంపిల్స్ కు మాత్రం నెగెటివ్ అని వఛ్చిన విషయాన్నీ అయన గుర్తు చేశారు. కాగా ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ జువాలాజికల్ పార్కును సందర్శకులకు అనుమతించకుండా తాత్కాలికంగా మూసి వేశారు. దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ కేసులు నమోదైన సంగతి విదితమే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆయా రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.