లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినం..ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు
ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని వారు ఎంతటివారైన సరైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ అధికార ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు...
కంటికి కనబడని కరోనా బీభత్సం సృష్టిస్తోంది. వైరస్ ధాటికి ప్రపంచదేశాలు గడగడలాడిపోతున్నాయి. భారత్లో ప్రవేశించిన వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. నిబంధనలు పాటించని వారు ఎంతటివారైన సరైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ అధికార ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఛత్తీస్ గఢ్ లో ఒక ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పాండే తన నివాసంలో పేదలకు బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. అది తెలిసిన స్థానిక జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సామాజిక దూరం పాటించకపోవడం, జనాలు గుంపులుగుంపులుగా ఎగబడి రావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ సందర్భంగా రాష్ట్రంలో 144వ సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
“లాక్ డౌన్” కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోమ్ సెక్రటరీలు నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపి లతో వీడియో కాన్ఫరెన్సు లు నిర్వహించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపి లతో ఎప్పటికప్పుడు, ఆయా అవసరాలను బట్టి నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితులను క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోమ్ సెక్రటరీ సమీక్షిస్తున్నారు. రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులను పూర్తిగా, పగద్బందీగా మూసివేయాలని, హైవేలపై, నగరాలలో ప్రజలు తిరగకుండా, జన సంచారం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల ఆరోగ్యభద్రత కోసమే కేంద్రం స్పష్టం చేసింది.