లాక్డౌన్ కొనసాగింపు కంపల్సరీ.. కానీ మార్పులు ఇవే
నాలుగు విడతల లాక్డౌన్ తర్వాత కూడా మరోసారి పొడిగింపు వుంటుందా అని అడుగుతున్న వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే నేరుగా సమాధానం ఇవ్వబోతున్నారా? ఢిల్లీ నుంచి…
Prime Minister Narendra Modi to announce lock down 5.0 details personally: నాలుగు విడతల లాక్డౌన్ తర్వాత కూడా మరోసారి పొడిగింపు వుంటుందా అని అడుగుతున్న వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే నేరుగా సమాధానం ఇవ్వబోతున్నారా? ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అంతేననిపిస్తోంది. అందుకు కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడత లాక్ డౌన్ ముగిసే రోజు అంటే మే 31వ తేదీనాడు మరోసారి ప్రధాన మంత్రి దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న నరేంద్ర మోదీ… లాక్ డౌన్ 5.0పై అదే రోజున ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.
గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇస్తూనే.. 5వ విడత లాక్ డౌన్ను ప్రధానమంత్రి ప్రకటిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసులు 11 నగరాలలోనే రికార్డవుతున్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. ఆ నగరాల్లో కరోనాను ఎలా కంట్రోల్ చేయాలో ఓ వ్యూహంతో ప్రధాన మంత్రి దేశ ప్రజల ముందుకు వస్తారని భావిస్తున్నారు. ప్రధాన సూచనల మేరకు లాక్డౌన్ 5.0 నిబంధనలను హోం శాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం.
జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్డౌన్ 5.0లో ప్రదానంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్కతా నగరాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు (మే 27 సాయంత్రం వరకు) నమోదైన 1.54 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, కోల్కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో వైరస్ కట్టడి మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.
లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చిలలో కార్యకలాపాలకు అనుమతిస్తారని ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవం లేదని హోంశాఖ చెబుతోంది. ఎందుకంటే 5వ విడత లాక్ డౌన్ విధివిధానాలపై ఇంకా ఇదమిత్థంగా ఓ క్లారిటీకి రాలేదని, అలాంటప్పుడు ఇప్పుడే లాక్ డౌన్ కొనసాగింపులో ఏమేం మార్పులు వస్తాయో ఎలా చెబుతామని హోం శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కరోనా ప్రభావం అంతగా లేని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ మతాలకు చెందిన ప్రార్ధనా స్ధలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధిస్తూ కోవిడ్-19 నిబంధనలను పాటించేలా వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రార్థనా స్ధలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయనున్నారు. కాగా జూన్ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాసింది కన్నడ సర్కార్.
లాక్డౌన్ 4.0లో హెయిర్ కటింగ్ సెలూన్లకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జిమ్లను, హెల్త్ క్లబ్లను తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. కంటెయిన్మెంట్ జోన్లు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో జిమ్, హెల్త్ క్లబ్లను తెరుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో వాటికి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది.