నదిలో స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి
ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు నదిలో దిగిన బాలుడిని మొసలి లాక్కెళ్లి చంపేసింది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా పట్టణం సమీపంలోని ఖరాస్ రోట నదిలో వెలుగుచూసింది.
ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు నదిలో దిగిన బాలుడిని మొసలి లాక్కెళ్లి చంపేసింది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా పట్టణం సమీపంలోని ఖరాస్ రోట నదిలో వెలుగుచూసింది. కేంద్రపారాకు చెందిన 15 ఏళ్ల బాలుడు స్నానం చేసేందుకు ఖరాస్ రోట నదిలోకి దిగాడు. నదిలో ఉన్న మొసలిని గమనించని బాలుడు ఈత కొడుతుండగా ఒక్కసారిగా మొసలి దాడి చేసింది. బాలుడ్ని నోట కరచుకొని నది లోపలకు లాక్కెళ్లింది. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పడవలతో గల్లంతైన బాలుడి కోసం ఐదు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీశామని కేంద్రపారా అగ్నిమాపకశాఖ అధికారి ఒకరు చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మొసలి దాడిలో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.