చనిపోయిన శునకానికి దశదినకర్మలు చేసిన రైతు
ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓ రైతు పెంచుకున్న శునకానికి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండలు కూడా నిర్వహించారు
ఇవాళ రేపు చనిపోతే రక్తసంబంధీకులే దూరమవుతున్నారు. కనీసం చనిపోయినవారికి కర్మకాండలు చేసేందుకు సైతం గాలికొదిలేస్తున్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓ రైతు పెంచుకున్న శునకానికి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండలు కూడా నిర్వహించారు. యూపీలోని మీరట్ జిల్లాలోని బాధం గ్రామంలో ఉదంతం చోటుచేసుకుంది. ఒక రైతు తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘పుష్ప’ మృతి చెందింది. రైతు యోగేష్ తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మృతి చెందడంతో దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం బాజా బజంత్రీల మధ్య అంత్యక్రియలు నిర్వహించాడు. ఇదే నేపధ్యంలో 13వ రోజున గ్రామస్తులందరికీ భారీ అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ముందు ఆ రైతు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక కార్డులను ముద్రించి గ్రామస్తులందరికీ పంచాడు.
‘పుష్ప’ను యోగేష్ ఆరేళ్ల పాటు పెంచిపోషించాడు. అది మృతి చెందినపుడు ఇంటిలోని సభ్యుడే మరణించిన రీతిగా యోగేష్ కుమిలిపోయాడు. గ్రామస్తులంతా వెంటరాగా యోగేష్ ఆ శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ శునకం మరణించిన తరువాత 13వ రోజున శాంతి హోమాన్ని నిర్వహించాడు. 13 మంది బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలు సమర్పించి ఘనంగా సత్కరించాడు. తరువాత ‘పుష్ఫ’ అస్థికలను పుణ్య నదిలో కలిపాడు. గ్రామస్తులందరికీ అన్నదానం చేసి పుష్పపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.