ఉద్యోగాల పేరుతో మోసం.. మాయలేడీతోసహా నలుగురు అరెస్ట్

నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు

ఉద్యోగాల పేరుతో మోసం..  మాయలేడీతోసహా నలుగురు అరెస్ట్
Follow us

|

Updated on: Sep 30, 2020 | 1:56 PM

నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధి వేటలో ఉన్న యువతే లక్ష్యంగా ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులకు కుచ్చుటోపి పెడుతున్న ఓ మహిళతోసహా మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ కుటుంబసభ్యులతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కరీంనగర్‌లోని ఆదర్శ నగర్‌లో నివాసముంటున్న మహిళ.. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేసింది. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. అంతేకాదు, ఇందు కోసం ముగ్గురు సభ్యులతో ముఠాగా ఏర్పడి దందా సాగిస్తోంది. ఇందుకు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన కంబాల రాజేశ్‌(41), కుసుమ భాస్కర్‌(48), భీమాశంకర్‌(28)లను ఎంచుకుంది. వీరంతా కరీంనగ్ కేంద్రంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. సదరు మహిళ కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్‌ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన ముఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. మరో వ్యక్తి నుంచి అస్పత్రిలో క్యాంటీన్‌ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్‌లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద నుంచి రూ.3లక్షలు వసూలు చేశారు. అంతేకాదు, నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్‌ చాటింగ్‌ చేసింది. దాన్ని అడ్డు పెట్టుకొని అతడిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ రూ.8 లక్షల వరకు లాగేసుకుంది.

కాగా, రోజుల తరబడి నిరీక్షించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. తమ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్‌లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో చేసేదీలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్‌ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని కరీంనగర్‌ సీపీ వీబీ.కమలాసన్‌ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.