నకిలీ నోట్ల దందా !
రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క నెలరోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు జిల్లాల్లో పెద్దమొత్తంలో ఫేక్ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపుతోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏది నకిలీ..ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి. ఇదే అదునుగా అమాయకులను అవలీలగా బోల్తా కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇటీవలే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ […]
రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క నెలరోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు జిల్లాల్లో పెద్దమొత్తంలో ఫేక్ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపుతోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏది నకిలీ..ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి. ఇదే అదునుగా అమాయకులను అవలీలగా బోల్తా కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇటీవలే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు..పట్టుబడిన ముఠా నుంచి 7 కోట్ల రూపాయల విలువచేసే నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మోసాలకు పాల్పడినట్లుగా ఖమ్మం పోలీసులు తేల్చారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తూ..చలామణీ చేస్తున్న ఓ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సినిమాల్లో ఆఫర్..ఈజీ మనీ కోసం దొంగనోట్ల వ్యాపారం మొదలు పెట్టింది ఓ కుటుంబం. సకుటుంబ సపరివార సమేతంగా దొంగనోట్ల తయారీ, చలామణిలో భాగస్వాములై పథకం అమలు చేశారు. చివరకు ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవాడు. కొంతకాలం తర్వాత జీవనోపాధి కోసం తొర్రూరుకు తన మకాం మార్చాడు. అక్కడ హోటల్ నడుపుతూ..కొంతకాలం జీవనం సాగించారు. హోటల్ నిర్వహణలో నష్టాలు రావడంతో 2017లో కుటుంబంతో సహా హైదరాబాద్కు మకాం మార్చాడు. అతని పెద్ద కుమారుడు సామల సాయి చరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం పైపు మళ్లాడు. షార్ట్ ఫిల్మ్లు, ప్రైవేటు సాంగ్ ఆల్బమ్లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్ నుంచి అవకాశం రావడంతో.. పెట్టుబడికి డబ్బు కావాల్సి వచ్చింది. దీంతో సాయిచరణ్ తండ్రి సామల శ్రీనివాస్ నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు…ఒక కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ. 200, రూ.500, రూ. 2 వేల నకిలీ నోట్లను తయారుచేయడం ప్రారంభించారు.
ఇక, వీరు తయారు చేసిన నకిలీ నోట్లను జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్చటం కష్టమవుతుందని భావించిన శ్రీనివాస్.. గ్రామాలను ఎంచుకున్నాడు. నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చలామణి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో బెల్టుషాపులో రూ. 500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు. అదే గ్రామానికి చెందిన కంచ రాజకుమార్ అనే వ్యక్తి నకిలీ నోటును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. కోరుకొండ పెళ్లి, ఇనుగుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుడు సామల శ్రీనివాస్ ప్రయాణిస్తున్న ఏపీ 36 x జీరో 222 మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 69 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, 29 వేల రూపాయల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో వీరు నివసిస్తున్న ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించే రెండు ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వీరు రెండు లక్షల మేరక నకిలీ నోట్లు చలామణి చేసినట్లుగా పోలీసులు తెలిపారు.