గోవాలో ఇంటిని నిర్మిస్తున్న సినీ హీరో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. గోవాలోని మాండ్రేమ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 211/2Bలో నాగ్ ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతి లేదని, ఈ నిర్మాణాలు వెంటనే ఆపాలంటూ సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులు జారీ చేశారు. గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాలు ఆపకపోతే, గోవా పంచాయతీ రాజ్ చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఐతే ఈ నోటీసులపై హీరో నాగార్జున ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా నాగార్జున హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-6 ఇటీవలే ముగిసింది. అయితే నాగార్జున తదుపరి సీజన్లో కనిపించరని ఇటీవల వార్తలొచ్చాయి.
నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ లేదా రానా దగ్గుబాటిని పరిశీలిస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రలో కనిపించారు నాగ్. ఆతర్వాత ది ఘోస్ట్ సినిమాతో అలరించారు. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..