
దీపం ఉండగానే ఇల్లు చక్కచెట్టుకోవాలనుకుంటున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రకరకాల బిజినెస్ లు చేస్తున్నారు. సమంత, రష్మిక మందన్నా, దీపికా పదుకొణె, అలియా భట్.. ఇలా స్టార్ హీరోయిన్స్ సైతం ఏదో ఒక వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమన్స్ గానూ పేరు గడిస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. తన సోదరితో కలిసి ఒక వాటర్ బ్రాండ్ కంపెనీని స్థాపించింది. ఇక్కడ అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, అలాగే 750 ml వాటర్ బాటిల్ ధర రూ.200లకు లభిస్తోంది. ఏంటి ఇంత రేట్లా? ఎవరు కొంటారు వీటిని అనుకునేరు? అయితే ఈ వాటర్ లో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హిమాలయ వాటర్ లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పైనే ఆధారపడుతున్నారు. పైగా వీటి కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ హిమాలయ వాటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామంటోందీ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోన్న భూమి తన సోదరి సమీక్షా పడ్నేకర్ తో కలిసి బ్యాక్బే ఆక్వా అనే వాటర్ బ్రాండ్ కంపెనీని స్థాపించింది. తాజాగా ఈ వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార. ‘మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్లలో లభ్యం అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ కూడా సులభంగా భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. పూర్తిగా పర్యావరణ స్పృహతో ఈ వాటర్ కంపెనీని స్టార్ట్ చేశాం’ అని తెలిపింది భూమి.
ఇక ఈ వాటర్ బ్రాండ్ కంపెనీకి పెట్టుబడిపై భూమి స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చింది.. ‘ నేను 17 ఏళ్ల వయసు నుంచే సంపాదిస్తున్నాను. అప్పటి నుంచే నేను పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం’ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.