ఏలూరు మిస్టరీ డిసీజ్.. చికిత్సపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆళ్ళ నాని కీలక ప్రకటన..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన బాధితులకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు.
Eluru Disease: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన బాధితులకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. బాధితులను స్వయంగా పరామర్శించిన ముఖ్యమంత్రి.. వారికి మెరుగైన వైద్య సదుపాయంతో పాటు మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను పెంచుతూ మంగళవారం సాయంత్రం జీవోను విడుదల చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.
మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయాన్ని మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న ప్యాకేజీని రూ. 15,688కు పెంచడంతో పాటు అందరికీ 8 రకాల రక్త పరీక్షలను చేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో మూర్ఛ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నవారి సమయాన్ని సైతం మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ. 10,262 నుంచి రూ.12,732కు పెంచారు. ఇందులో 6 రకాల రక్త పరీక్షలను కూడా చేర్చారు. ఇక అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో ఐదురోజుల కాకుండా అదనంగా ఎక్కువ రోజులు చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందితే రూ. 2వేల ప్యాకేజీని కొత్తగా చేర్చామన్నారు.