కొబ్బరి చిప్పలో కూర్చిన క్రాకర్స్ పేలడం వల్లేనా ? ఏనుగు మృతిలో కొత్త కోణం
కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గర్భస్థ ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు, అటవీశాఖ జరుపుతున్న దర్యాప్తులో మరో కొత్త విషయం బయటపడింది. కొబ్బరి చిప్పలో కూర్చిన చిన్నపాటి..
కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గర్భస్థ ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు, అటవీశాఖ జరుపుతున్న దర్యాప్తులో మరో కొత్త విషయం బయటపడింది. కొబ్బరి చిప్పలో కూర్చిన చిన్నపాటి నాటుబాంబుల వంటి పేలుడు పదార్థాలు నోటిలో పేలడం వల్లే అది మరణించిందని మన్నార్కడ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. క్రాకర్స్ కూర్చిన పైన్ యాపిల్ తినడంవల్లే ఇది మరణించినట్టు ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే బహుశా ఈ ఏనుగు కొబ్బరికాయను పగులగొట్టి.. అందులో క్రాకర్స్ ఉన్న భాగాన్ని తిని ఉంటుందని, దీంతో గజరాజు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని భావిస్తున్నారు. ఈ కారణంగా అది రోజుల తరబడి ఆహారం తినలేక పోగా.. కనీసం నీరు కూడా తాగలేకపోయింది. అటు- ఈ కేసులో మొట్టమొదటి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాక్ష్యాల సేకరణలో భాగంగా ఈ వ్యక్తిని ఈ జిల్లాలో స్పాట్ కు తీసుకువెళ్లినట్టు సునీల్ కుమార్ వెల్లడించారు. ఓ షెడ్ లో పేలుడు పదార్థాలు తయారు చేసే మరో ఇద్దరికి ఇతగాడు సాయం చేస్తుంటాడని తెలిసిందన్నారు. రబ్బర్ ను సేకరించి దానితో వస్తువులు తయారు చేసే సుమారు 40 ఏళ్ళ ఇతడ్ని విల్సన్ గా గుర్తించారు. ఇతని సాయం పొందే మరో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.