నాగార్జునసాగర్లో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
నాగార్జున సాగర్ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. ఇవాళ్టి నుంచి సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.
Nagarjuna sagar bypoll Nominations: నాగార్జున సాగర్ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. ఇవాళ్టి నుంచి సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించి… మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. నేటి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు అధికారులు. ఈనెల 31న పత్రాలను పరిశీలించనుండగా.. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.
కాగా, నామినేషన్ల స్వీకరణ కోసం నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక చాంబర్, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్లు సమర్పించే సమయంలో కొవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని మాత్రమే అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2,19,745 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,08,907 మంది పురుషులు, 1,10,838 మంది మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించి… మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు.
కాగా, ఇప్పటివరకు ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన ఈనెల 30న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, రంజిత్ యాదవ్, గురవయ్య యాదవ్ టికెట్ను ఆశిస్తున్నారు. బీజేపీ తరుఫున ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. TRS తన అభ్యర్థిని ప్రకటించాకే BJP అభ్యర్థిని వెల్లడించే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః ఆధార్ లింక్ ఉంటేనే భాగ్యనగరంలో ఉచిత నీటి పథకం.. మరో నెల రోజుల పాటు గడువు పొడిగింపు