రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి.. సీఎం సీరియస్
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెచ్చిపోయిన రౌడీ షీటర్లు పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందగా,
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెచ్చిపోయిన రౌడీ షీటర్లు పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చౌబెపూర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు ఓ పోలీసుల బృందం శుక్రవారం తెల్లవారుజామున అక్కడకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రౌడీలు పోలీసులపై అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు ఈ ఘటనపై కాన్పూర్ ఏడీజీ జేఎన్ సింగ్ మాట్లాడుతూ.. ”హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పిస్తున్నాం” అని అన్నారు. కాగా బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్ వికాస్ దూబేపై 57 క్రిమినల్ కేసులు ఉన్నాయి.