టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక హాయిగా పాఠాలు వినేయొచ్చు..!
పదోతరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో పదో తరగతి పరిక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ..
పదోతరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో పదో తరగతి పరిక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న విద్యార్థులను పరీక్షలకు స్నద్ధం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్.
పదో తరగతి విద్యార్థులకు ఇకపై ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు వినిపించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సప్తగిరి చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్న విద్యా శాఖ ఇప్పుడు, ఆకాశవాణి ద్వారా విద్యార్థులకు ఆడియో పాఠాలు వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ… ఇకపై ఆకాశవాణి ద్వారా పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించుకొని 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కారణంగా ఒకసారి, కరోనా వైరస్ వల్ల మరోసారి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున 10వ తరగతి విద్యార్థులకు విద్యా అమృతం పథకం కింద ప్రతి రోజు దూరదర్శన్ చానల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా తరగతులు ఇప్పటికే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇకపై ఆకాశవాణి ద్వారా కూడా పాఠాలు వినే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.