వెండి సింహాల మాయంపై పోలీసులకు ఈవో ఫిర్యాదు
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి రథం వెండి సింహాల మాయంపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ లకు ఈవో సురేష్ బాబు ఫిర్యాదు అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి రథం వెండి సింహాల మాయంపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ లకు ఈవో సురేష్ బాబు ఫిర్యాదు అందజేశారు. గత ఏడాది తర్వాత రథాన్ని తీయలేదని, ఇంజనీరింగ్ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్టు గుర్తించామని ఫిర్యాదులో తెలిపారు.
ఈ నెల 13న రథాన్ని పరిశీలిస్తుండగా వెండి తాపడం చేసిన నాలుగు సింహాల విగ్రహాలలో మూడు మాయమైన విషయం వెలుగు చూసింది. ఈ వెండి రథాన్ని 2002లో తయారు చేయించారు. అమ్మవారి సింహ వాహనానికి గుర్తుగా రథానికి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో విగ్రహానికి 10 కిలోల వెండి తాపడం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత ధరల ప్రకారం చోరీ అయిన వెండి సింహాల విగ్రహాల విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతియేటా ఉగాది రోజు గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. 2019లో ఉగాది రోజు వెండి రథాన్ని బయటకు తీసి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం మహామండపంలో రథాన్ని నిలిపారు. ఈ ఏడాది ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు.
దుర్గామల్లేశ్వర స్వామి రథం మూడు వెండి సింహాల విగ్రహాలు మాయమైన నేపథ్యంలో నాలుగో సింహాన్ని తొలగించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఆ సింహం ప్రతిమ బరువు దాదాపు నాలుగు కేజీలు ఉన్నట్లు ఈవో సురేష్ బాబు చెబుతున్నారు.
దుర్గగుడి వెండి సింహాల వివాదం మరో టర్న్ తీసుకుంది. వెండి సింహాల మాయంపై విపక్షాలు చేస్తున్న కామెంట్స్కు దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు గట్టి కౌంటర్సే ఇచ్చారు. చంద్రబాబు సతీమణి క్షుద్రపూజలు జరిపించినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో ఎన్నో ఆలయాలను కూల్చిన చంద్రబాబు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
ఇక ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కామెంట్స్పై సోమినాయుడు స్పందించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయన్న బుద్ధా వెంకన్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు విగ్రహాలు ఆయన ఇంట్లోనే ఉన్నాయేమో అన్న అనుమానాన్ని రేకెత్తించారు దుర్గగుడి చైర్మన్.