తెలంగాణ కరోనా పేషంట్‌కు కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసిన హాస్పిటల్‌

ప్రైవేటు హాస్పిటల్స్‌ జలగల్లా పట్టి పీడిస్తాయని... లేని రోగాలకు కూడా లక్షలకు లక్షలు బిల్లులు వేసి రక్తం తోడేస్తారని అనుకుంటాం కానీ.. అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి

తెలంగాణ కరోనా పేషంట్‌కు కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసిన హాస్పిటల్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2020 | 1:10 PM

ప్రైవేటు హాస్పిటల్స్‌ జలగల్లా పట్టి పీడిస్తాయని… లేని రోగాలకు కూడా లక్షలకు లక్షలు బిల్లులు వేసి రక్తం తోడేస్తారని అనుకుంటాం కానీ.. అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి.. ఈ విషయంలో దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిని ఎంతగా మెచ్చుకున్నా తప్పులేదు.. అసలు జరిగిందేమిటంటే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాల రాజేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు.. అక్కడే కాయకష్టం చేసుకుంటున్నాడు.. 42 ఏళ్ల రాజేశ్‌ ఓ దుర్ముహూర్తాన కరోనా వైరస్‌ బారిన పడ్డాడు.. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు.. 80 రోజుల పాటు రాజేశ్‌కు చికిత్సను అందించిందా హాస్పిటల్‌.. మొత్తానికి రాజేశ్‌ చక్కగా కోలుకున్నాడు.. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు.. కాకపోతే బిల్లు మాత్రం తడిసిమోపడయ్యింది.. సుమారు ఏడు లక్షల 62 వేల దిరమ్స్‌ బిల్లు వేసింది ఆసుపత్రి యాజమాన్యం.. మన కరెన్సీలో చెప్పాలంటే కోటిన్నర!

బిల్లు చూడగానే రాజేశ్‌కు గుండె గుబిల్లుమంది.. తన దీనగాధను గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ స్వామినారాయణ్‌.. దేవాలయ కమిటీ సభ్యుడు అశోక్‌ కొటేచా దృష్టికి తీసుకెళ్లాడు రాజేశ్‌.. వాళ్లు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇండియన్‌ కాన్సలేట్‌ లేబర్‌ అధికారి హర్జీత్‌ సింగ్‌ను సంప్రదించారు.. రాజేశ్‌ స్థితిగతులను ఆయనకు వివరించారు.. రూపాయి కూడా కట్టలేని నిస్సాహయస్థితిలో ఉన్నాడని చెప్పారు. హర్జీత్ సింగ్‌ బిల్లు మాఫీ చేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి ఓ లేఖ రాశారు.. ఆసుపత్రి కూడా సహృదయతో బిల్లును మాఫీ చేసింది.. పైసా తీసుకోకుండా రాజేశ్‌ను డిశ్చార్జ్‌ చేసింది. అంతేనా… రాజేశ్‌తో పాటు అతడి సహాయకుడు కనకయ్యకు అశోక్‌ కొటేచా విమాన టికెట్లు కొనివ్వడమే కాకుండా చేతి ఖర్చుల కోసం పది వేల రూపాయలు ఇచ్చి భారత్‌కు పంపాడు.. హైదరాబాద్‌కు వచ్చిన వారిద్దరిని హోం క్వారంటైన్‌కు అధికారులు అనుమతి ఇచ్చి సొంతూరికి పంపించారు..