కరీంనగర్ జిల్లాకు కొత్తభయం..మిస్టరీగా కుక్కల మృతి
కరీంనగర్ జిల్లాను ఇప్పుడు మరో కొత్త భయం వెంటాడుతోంది. అంతుచిక్కని రోగంతో పదుల సంఖ్యలో వీధి కుక్కలు మరణించటంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు...
అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ కొత్త సంఘటనలు ప్రజల్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్నట్టుండి మూగజీవాలు మృత్యువాత పడుతుండటం కలవరం రేపుతోంది. ఇప్పటికే కోవిడ్ 19 వైరస్ కోరల్లో చిక్కుకున్న తెలంగాణలోని కరీంనగర్ జిల్లాను ఇప్పుడు మరో కొత్త భయం వెంటాడుతోంది. అంతుచిక్కని రోగంతో పదుల సంఖ్యలో వీధి కుక్కలు మరణించటంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ఓడేడ్ గ్రామంలో వరుసగా వీధి కుక్కలు మరణిస్తుండటం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి 12 కుక్కలు మరణించడంతో ఏం జరిగిందోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ జూలో పులికి కూడా కరోనా వ్యాపించడంతో కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పశువైద్యాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
గ్రామంలో మూడు రోజుల క్రితం కరోనా వైరస్ ప్రభలకుండా ఉండటానికి శానిటైజర్లు చల్లారు.హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో అది పడిన ఆహారం, నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. పిచికారీ చేసిన తర్వాతే శునకాలు మరణిస్తున్నందున ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో వాటికి తిండిలేక కూడా మరణించే అవకాశం ఉందంటున్నారు.