సంగీత దర్శకుడు బాలభాస్కర్ను గోల్డ్ స్మగ్లర్లే హత్య చేశారా?
సుమారు రెండు సంవత్సరాల కిందట కారు ప్రమాదంలో ప్రఖ్యాత వాయులీనం విద్యాంసుడు, సినీ సంగీత దర్శకుడు బాలభాస్కర్ చనిపోయినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు! మరెన్నో సందేహాలు!
సుమారు రెండు సంవత్సరాల కిందట కారు ప్రమాదంలో ప్రఖ్యాత వాయులీనం విద్యాంసుడు, సినీ సంగీత దర్శకుడు బాలభాస్కర్ చనిపోయినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు! మరెన్నో సందేహాలు! అది ప్రమాదం కాదని, పకడ్బందీ పథకంతో హత్య చేశారని చాలా మంది ఇప్పటికీ అనుకుంటుంటారు.. బాలభాస్కర్ మృతిపై కేరళ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది.. అసలు ఆ ప్రమాద ఘటనకు, గోల్డ్ స్మగ్లర్లకు ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.. ముందునుంచి ఇది ప్రమాదం కాదు, హత్యేనంటున్న నటుడు కళాభవన్ సోబి ఆ ప్రమాదస్థలిలో గోల్డ్ స్మగ్లర్ పీఎస్ సరిత్కుమార్ తచ్చాడుతుండటాన్ని తాను కళ్లారా చూశానని అంటున్నాడు. మొన్నీమధ్యనే బంగారం అక్రమ రవాణా కేసులో సరిత్కుమార్ ఏ 2 నిందితుడు.
2018 సెప్టెంబర్ 25న బాలభాస్కర్ ఆయన భార్య లక్ష్మి, కూతురు తేజస్విని త్రిసూర్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. తిరువనంతపురం శివార్లలోని పల్లిపురం దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్పాట్లోనే తేజస్విని మరణించింది. తీవ్రంగా గాయపడిన బాలభాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 2న కన్నుమూశాడు. భార్య లక్ష్మి, డ్రైవర్ అర్జున్ ప్రాణాలతో బయటపడ్డారు.. అయితే అప్పుడే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వచ్చాయి. బాలభాస్కర్ది అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.. ఆ ఫిర్యాదు కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.
ప్రమాదస్థలిలో సరిత్కుమార్ అనుమానాస్పదంగా అటు ఇటు తిరగడాన్ని తాను చూశానని చెబుతున్నారు కళాభవన్ సోబి. అప్పుడతను ఎవరో తనకు తెలియకపోయినా గత మూడు నాలుగు రోజులుగా సరిత్కుమార్ ఫోటో పేపర్లలో రావడంతో ఇప్పుడు గుర్తుపట్టానని సోబి అంటున్నారు. అసలు ప్రమాదం జరిగినప్పటి నుంచి సోబి అందులో ఏదో మతలబు ఉందనే చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాలకే సోబి ఆ దారి గుండా వెళ్లారు.. కొందరు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించారు. అప్పట్లో క్రైమ్ బ్రాంచ్కు ఈ విషయాలన్ని వివరించినా ఎందుకో వారు సమగ్రంగా దర్యాప్తు చేయలేదు.. అనంతరం దర్యాప్తులో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొందరు గోల్డ్ స్మగ్లర్ల ఫోటోలను సోబికి చూపించింది.. కానీ అందులో సరిత్కుమార్ ఫోటో మాత్రం లేదు. ఇప్పుడు డిప్లోమాటిక్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సరిత్ కుమార్ అరెస్ట్ కావడంతో సోబి అతడిని గుర్తు పట్టాడు.. కారు ప్రమాదానికి గోల్డ్ స్మగ్లర్లకు ఏమైనా లింకులున్నాయేమో అన్న అనుమానంతోనే డీఆర్ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నది.. బాల భాస్కర్ కుటుంబ సభ్యుల సందేహం కూడా ఇదే! ఎందుకంటే బాలభాస్కర్ మాజీ మేనేజర్కు గోల్డ్ స్మగ్లర్లకు సంబంధాలుండటమే! 25 కిలోల బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తూ త్రివేండ్రమ్ ఎయర్పోర్ట్ లో దొరికిపోయాడు కూడా! ఈ సంఘటన 2019, మే 13న జరిగింది.. ఈ కేసులో కస్టమ్స్ ఆఫీసర్ బి. రాధాకృష్ణన్ కూడా అరెస్టయ్యాడు.
ఇది గోల్డ్ స్మగ్లర్ల పనేనా..?
బాలభాస్కర్ కారు ప్రమాదానికి గురైన పది నిమిషాలకే తాను ఆ స్పాట్ నుంచే వెళ్లానని.. ఆ కారు బాలభాస్కర్దన్న విషయం తనకు అప్పుడు తెలియదని సోబి క్రైమ్బ్రాంచ్కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే జనాలు అక్కడ మూగారని, తాను కొద్దిగా ముందుకెళ్లే సరికి ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లాడాన్ని చూశానన్నాడు సోది.. మరో వ్యక్తి బైక్ను తోసుకుంటూ వెళ్లడం కూడా తనకు కనిపించిందన్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తుల సంబంధీకులేమోనని తాను అనుకున్నానని చెప్పాడు సోబి. కాసేపటికే కొందరు వ్యక్తులు తన కారు బానెట్ను బాదుతూ త్వరగా వెళ్లిపోవాలంటూ హెచ్చరించారన్నారు సోబి. జనానికి దూరంగా రోడ్డుకు ఆవల రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఓ వ్యక్తి నిలుచున్నాడని.. అతనెవరో కాదు సరిత్కుమారేనని కచ్చితంగా చెబుతున్నారు సోబి. ఇప్పుడు బాలభాస్కర్ను స్మగ్లర్లు ఎందుకు చంపాల్సి వచ్చిందన్నది ప్రశ్నగా మారింది..