శశికళ విడుదలకు దినకరన్ హాస్తిన రాయబారం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్రమార్జన కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ ముందస్తు విడుదల కోసం అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఢిల్లీకి పయనమయ్యారు. శశికళను ఎలాగైనా బయటకు రప్పించేందుకు ఢిల్లీ వేదికగా పావులు కదిపేందుకు ప్రత్యేక చార్టెడ్ విమానంలో ఆయన హస్తీనకు చేరుకున్నారు.
అక్రమార్జన కేసులో శశికళ వాస్తవానికి వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. జైలులో సత్ప్రవర్తన, తక్కువగా పెరోలు సదుపాయం వాడుకోవడం వంటి కారణాల వల్ల జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఆమె విడుదలపై ఆర్టీఐ చట్టం ప్రకారం ఇందుకు సంబంధించిన సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో శశికళను అంతకంటే ముందుగా ఆమె బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా విడుదల చేయించే అవకాశాలు ఉన్నాయేమోనని దినకరన్ ఢిల్లీలోని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న దినకరన్, ఆయన స్నేహితుడు మల్లిఖార్జునన్ సుప్రీం కోర్టు న్యాయవాదులతోను, న్యాయనిపుణు లతోనూ శశికళ విడుదల గురించి సమగ్రంగా చర్చలు జరుపనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య ఆమె విడుదల చేయించాలని దినకరన్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ ప్రభంజనాన్ని చాటుకోవాలని దినకరన్ భావిస్తున్నారు.