మురికివాడలకు పాకిన కరోనా..ముంబై ధారవిలో తొలి మరణం
భారత్ను కరోనా కమ్మేసింది. దేశనలుమూలలకు దావాలనంలా విస్తరిస్తూ..మరణమృదంగం మోగిస్తోంది. అక్కడ, ఇక్కడా అనే తేడా లేకుండా ఇప్పుడు మురికివాడలకు కూడా పాకింది...
భారత్ను కరోనా కమ్మేసింది. అన్ని రాష్ట్రాలపై పంజా విసిరిన వైరస్ విలయ తాండవం చేస్తోంది. దేశనలుమూలలకు దావాలనంలా విస్తరిస్తూ..మరణమృదంగం మోగిస్తోంది. అక్కడ, ఇక్కడా అనే తేడా లేకుండా ఇప్పుడు మురికివాడలకు కూడా పాకింది. ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ ధారవిలో తొలి కరోనా మరణం సంభవించింది. జనసాంద్రత ఎక్కువగా ఉండే మురికివాడల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడం అధికారులకు తలకుమించిన భారంగా మారుతోంది.
భారత్లోకి ప్రవేశించిన మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. వైరస్ దాటికి మహారాష్ర్ట చిగురుటాకుల వణుకుతోంది. రాష్ట్రప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య వందల్లోకి చేరింది. తాజాగా ముంబైలోని ధారవిలో తొలి కరోనా మరణం సంభవించింది. 56 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం అతడు చనిపోయాడు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో అతడు మార్చి 23న టెస్ట్లు చేయించుకోగా, వైరస్ పాజిటివ్గా తేలింది. మార్చి 26న అతడు సియాన్ ఆస్పత్రిలో చేరాడు. ఏప్రిల్ 1 సాయంత్రం అతడు మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు.
మృతుడు దారవిలోని ఎస్ ఆర్ ఏ బిల్డింగ్లో నివసిస్తూ.. బట్టల వ్యాపారం చేస్తుంటాడు. కరోనాతో వ్యక్తి మరణించడంతో.. అతడి కుటుంబ సభ్యులకు కూడా బీఎంసీ పరీక్షలు నిర్వహిస్తోంది. అతడు నివసించిన బిల్డింగ్ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి.. పోలీసులను మోహరించారు. ఆసియాఖండంలోనే అతిపెద్ద మురికివాడ ధారవి ప్రాంతం. ఇక్కడ 5 చ.కి.మీ విస్తీర్ణంలోనే పది లక్షల మంది ప్రజలు నివసిస్తన్నారని అంచనా. అంతటి జనసాంద్రత ఉన్న ప్రాంతంలో కోవిడ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. మృతుడు నివసించిన బిల్డింగ్లో 308 ఫ్లాట్స్, 91 షాపులు ఉన్నాయి. కాగా, మృతిచెందిన వ్యక్తికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేన్నట్లుగా గుర్తించారు. అయినప్పటికీ అతడికి వైరస్ సోకటానికి గల కారణాలపై అటు వైద్యులు, ఇటు అధికారులు విశ్లేషిస్తున్నారు.