వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది.. వారు జోక్యం చేసుకోవాలన్న దేవినేని ఉమ
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు హైకోర్టు, అటు సుప్రీకోర్టులో కూడా ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావడంతో..
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు హైకోర్టు, అటు సుప్రీకోర్టులో కూడా ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావడంతో నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో అధికార, పత్రిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.
టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లారని, వాటిని స్వీకరించడానికి అధికారులు లేరని దేవినేని ఉమ అన్నారు. దీనిపై వెంటనే రాష్ట్రపతి, గవర్నర్ లు స్పందించాలని కోరారు. ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ కోరారు.
పెట్రో ధరలపై కూడా దేవినేని ఉమ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్.. దేశంలో మూడోస్థానం. అదనపు వ్యాట్, రోడ్ల పన్నులంటూ భారీగావడ్డింపు, సీఎన్జీనీ వదలని వైనం. చంద్రబాబు నాయుడి హయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పుల్లోకి తెచ్చారు. పన్నులు వేయడంలో అగ్రగామిగా నిలిపారు. దీంతో దేశం మొత్తం మనవైపు చూసేలా చేసినమాట వాస్తవంకాదా?’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
పెట్రోల్,డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్, దేశంలోమూడోస్థానం.అదనపువ్యాట్, రోడ్లపన్నులంటూ భారీగావడ్డింపు,CNGని వదలనివైనం. @ncbnహయాంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఏపీని నేడు అప్పులుతేవడం,పన్నులువేయడంలో అగ్రగామిగా నిలిపి దేశంమొత్తం మనవైపు చూసేలా చేసినమాట వాస్తవంకాదా?@ysjagan pic.twitter.com/AC6oainP3L
— Devineni Uma (@DevineniUma) January 25, 2021