ఏపీలో రైతులకు ఉచిత బోర్ వెల్స్.. అర్హతలివే
సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం 'వైఎస్సార్ రైతు భరోసా' అనే పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ రైతు భరోసా’ అనే పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పథకంలో భాగంగా సన్న, చిన్న కారు రైతులకు ఉచిత బోర్వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయబోరు.
బోర్వెల్స్కు అర్హతలు, విధివిధానాలు: 1. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
2. ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
3. ఆ తరువాత దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. ఆ తరువాతే తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది.
4. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేయనున్నారు.
5. బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేయనున్నారు.