ఢిల్లీలో రిటైర్డ్ నేవీ అధికారి దారుణహత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు. దేశ్వాల్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
ద్వారకలోని సెక్టార్ 12 లోని అపార్ట్మెంటును దేశ్వాల్ అతని వ్యాపార భాగస్వాములు కలిసి నిర్మాణం చేపట్టారు. అయితే, ప్రదీప్ ఖోకర్ అనే వ్యక్తి ఆ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి అతను దేశ్వాల్కు 5 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వాలని దేశ్వాల్ డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంతలో ఆగ్రహంతో పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చిన ప్రదీప్ ఖోకర్ ఒక్కసారిగా దేశ్వాల్పై అతి దగ్గరగా కాల్పులు జరిపాడు. దీంతో దేశ్వాల్ నోట్లో బుల్లెట్ దూసుకు పోయిందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన దేశ్వాల్ను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేశ్వాల్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుడు ప్రదీప్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపులు చేపట్టామని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ మీనా తెలిపారు.