ఢిల్లీలో పసిపాప..వెయ్యి కి.మీ దూరంలో తల్లి…! విమానంలో పాలు
దేశరాజధాని ఢిల్లీలో ఓ నెలరోజుల పసికందు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ, కన్నతల్లి మాత్రం బిడ్డకు పాలివ్వలేని స్థితిలో వెయ్యికిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో విమానంలో తల్లిపాలు తీసుకొచ్చి బిడ్డకు అందిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా.. కల్తీ వస్తువులే దర్శనమిస్తున్నాయి. పప్పులు, ఉప్పులతో సహా పాలు కూడా కల్తీ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో పట్టణాలు, నగరాల్లో ఉంటున్న తమ పిల్లల కోసం గ్రామాల నుంచి తల్లిదండ్రులు ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆవు, గేదె పాలను పంపిస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఓ తండ్రి తన బిడ్డకు పట్టించే పాలను స్వస్థలం నుంచి తెప్పిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం లేహ్నుంచి పాలు వస్తున్నాయి. వాటి కోసం అతడు ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురుచూస్తుంటాడు. కాకపోతే, అవి తల్లిపాలు. అంటే అతడి భార్య తన బిడ్డ కోసం పంపిస్తున్న పాలు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల పసికందు కోసం ఆ తల్లిదండ్రులు ఇలా పడరాని కష్టాలు పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
నెల రోజులు కూడా నిండని ఓ పసిపాపకు ఢిల్లీలో సర్జరీ అవుతోంది. ఆ బిడ్డకు ఇమ్యూనిటీ కోసం తల్లి పాలు చాలా అవసరమని చెప్పారు వైద్యులు. కానీ, ఆ పాప తల్లి లడఖ్లోని లేహ్లో ఉంది. అసలే కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.. పైగా ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. దీంతో 1000 కి.మీ. దూరంలోని ఢిల్లీకి ఆమె వచ్చే పరిస్థితి లేదు. దీంతో తల్లి పాలను ప్రతి రోజూ విమానంలో తరలిస్తున్నారు. అయితే, రోడ్డు మార్గంలో తల్లిపాలను తరలించాలంటే, ఆలస్యం అవుతుంది. దాంతో పాలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ఇలా విమానంలో పాలను తరలిస్తున్నారు.
అయితే, విమానంలో పాలు తరలింపు అంటే ఖర్చుతో కూడుకున్నది అనుకుంటారు. కానీ, ఇదంతా మానవత్వంతో జరుగుతున్న ప్రక్రియగా తెలుస్తోంది. పాప తండ్రి స్నేహితుడొకరు లేహ్ ఎయిర్ పోర్టులో పని చేస్తున్నాడు. అతడి సాయంతో పాప కుటుంబ సభ్యులు లేహ్ ఎయిర్ పోర్టులో అతనికి తల్లి పాలను తీసుకొచ్చి అందజేస్తారు. అక్కడ్నుంచి విమాన సిబ్బందితో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పంపిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పాలు వచ్చే సమయానికి పాప తండ్రి అక్కడికి వెళ్తాడు. విమానాశ్రయం నుంచి పాలను తీసుకొచ్చి ఆ బిడ్డకు ఇస్తున్నాడు. ఇలా గత కొద్ది రోజుల నుంచి జరుగుతోంది. పాపకు శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్లు.. చిన్నారి కోలుకుంటోందని, వచ్చే వారం పసిపాపను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇకపోతే, చిన్నారికి వచ్చిన సమస్య ఏంటనే విషయానికి వస్తే…పుట్టుకతోనే ఆ శిశువుకు ఆహార నాళం, శ్వాస నాళం రెండూ కలిసిపోయాయి. దీంతో ప్రత్యేక సర్జరీ అవసరమని లేహ్ వైద్యులు చెప్పారు..దీంతో ఆ పాపను ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అనేకమంది నెటిజన్లు స్పందిస్తూ…పాప త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Read More: మరణంలోనూ కవలలు కలిసే..తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి