రాజధానిలో కరోనా డేంజర్ బెల్స్..50 వేలు దాటిన కేసులు
భారత్లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..ఆ మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
భారత్లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..ఆ మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14, 516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకు మొత్తం 3,95,048 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో మరో 375 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12,948కు పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,13,831 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉంటే, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత రికార్డులను బ్రేక్ చేస్తూ…గడచిన 24 గంటల్లో ఏకంగా 3,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 50 వేలు దాటింది. మరణించిన సంఖ్య రెండు వేలను దాటింది. ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 2035 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఇప్పటివరకు 23,569 మంది రోగులు కోలుకోగా, ప్రస్తుతం 27,512 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే 10, 490 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.