కరోనా రోగుల్ని తిప్పి పంపారో ! ఆస్పత్రులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ !
ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి..
ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి.. తిప్పి పంపివేస్తే సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్ఛరించారు. రోగులకు అవసరమైన పడకలపై నిఘా పెట్టేందుకు ప్రతి ప్రైవేటు ఆసుపత్రి వద్ద మెడికల్ ప్రొఫెషనల్స్ ని నియమిస్తామని ఆయన వెల్లడించారు. కొన్ని హాస్పిటల్స్ కావాలనే తప్పుడు పనులు చేస్తున్నాయి. బెడ్ ల కొరతను సాకుగా చూపి రోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది అని అన్నారాయన. పడకల కొరత వెనుక ఓ మాఫియాహస్తం ఉందని, దానికి కొన్ని పార్టీల మద్దతు ఉన్నట్టు చెప్పిన ఆయన.. ఆ పార్టీల నేతలు తమను రక్షిస్తారని ఈ మాఫియా ముఠా అనుకుంటే అది భ్రమే అవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. హాస్పిటల్స్ లో పడకల లభ్యతపై కరోనా రోగులకు సమాచారం తెలిపేందుకు ‘ఢిల్లీ కరోనా యాప్’ అనే పేరిట ఓ యాప్ ని కేజ్రీవాల్ ఇటీవలే లాంచ్ చేశారు.