రేపట్నుంచే తిరుమల శ్రీవారి దర్శనాలు…ఈ వివరాలు తెలుసుకోండి..
భక్తులకు ఎట్టకేలకు ఏడు కొండలవాడి దర్శనం దక్కనుంది. ఎనభై రోజుల తరవాత ఈ సోమవారం నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం, మంగళవారం ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు నిర్వహిస్తారు.
భక్తులకు ఎట్టకేలకు ఏడు కొండలవాడి దర్శనం దక్కనుంది. ఎనభై రోజుల తరవాత ఈ సోమవారం నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం, మంగళవారం ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీన తిరుమలపై ఉన్న స్థానికులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు. 11వ తేదీ నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభం అవుతాయి. జూన్ నెలలో దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా టికెట్ల బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్ లైన్ లోనూ టికెట్లు లభ్యం కానున్నాయి. కాగా అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
మరోవైపు కాణిపాకం విఘ్నేశ్వరుడి దేవాలయంలో సోమవారం నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పదో తేదీ నుంచి గంటకు మూడు వందలమంది వరకూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు దేవస్థానం అధికారులు. ఇక శ్రీకాళహస్తి దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని అధికారులు ప్రకటించారు.