లైవ్ అప్డేట్స్ : సూపర్ సైక్లోన్గా మారిన “ఫొని”
బంగ్లాలో ‘ఫొని’ తుపాను బీభత్సం నిన్న ఏపీ, ఒడిశాలో తీవ్ర ప్రభావం చూపిన ఫొని తుపాను బంగ్లాదేశ్లో ఇవాళ బీభత్సం సృష్టించింది. ఫొని తుపాను శనివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ తీరం తాకిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా ఆ దేశంలో 14 మంది మృతిచెందగా, 63 మందికి గాయాలయ్యాయి. తీరం దాటే సమయంలో ఫొని తుపాను నౌఖలి, భోలా,లక్ష్మీపూర్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 16లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను వల్ల […]
బంగ్లాలో ‘ఫొని’ తుపాను బీభత్సం
నిన్న ఏపీ, ఒడిశాలో తీవ్ర ప్రభావం చూపిన ఫొని తుపాను బంగ్లాదేశ్లో ఇవాళ బీభత్సం సృష్టించింది. ఫొని తుపాను శనివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ తీరం తాకిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా ఆ దేశంలో 14 మంది మృతిచెందగా, 63 మందికి గాయాలయ్యాయి. తీరం దాటే సమయంలో ఫొని తుపాను నౌఖలి, భోలా,లక్ష్మీపూర్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 16లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పలు విమానాలు రద్దయ్యాయి. గువాహటి నుంచి రాకపోకలు సాగించే 59 విమానాలు రద్దు చేశారు. అగర్తలా నుంచి రాకపోకలు సాగించే 8 విమానాలు, దిబ్రుగఢ్ నుంచి రాకపోకలు సాగించే నాలుగు విమానాలు, ఇంఫాల్ నుంచి రాకపోకలు సాగించే 6 విమానాలు రద్దు చేశారు.
ఒడిషా తీరం దాటి.. బెంగాల్ దిశగా వెళ్తున్న ఫొని
ఇదిలా ఉండగా ఫొని తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఫొని తుఫాన్ తీరం దాటే సమయంలో 150-175 కేఎంపీహెచ్ వేగంతో ఉధృతమైన గాలులు వీచినట్లు తెలిపారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇదిలా ఉంటే ఒడిశాలో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని అతి తీవ్రతుపాను క్రమంగా బలహీనపడి పశ్చిమ్బంగాను తాకింది. శుక్రవారం ఉదయం 8.45 సమయంలో పూరీకి దక్షిణంగా వద్ద తీరం దాటిన ఫొని తుపాన్ ఈశాన్య దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం బెంగాల్లోకి ప్రవేశించింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఉదయం తీరాన్ని దాటే క్రమంలో 230 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఒడిశాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పూరీతోపాటు మరో నాలుగు జిల్లాలు దెబ్బతిన్నాయి. చెట్లు, సెల్టవర్లు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.
‘ఫొని’ బాధితుల కోసం మేము సైతం – ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ‘ఫొని’ తుఫాన్ బాధితుల కోసం వినూత్న రీతిలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా తుఫాన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించడం కోసం ‘ఐ యామ్ సేఫ్’ అనే ఆప్షన్ను ఫేస్బుక్ యాక్టివేట్ చేసింది. కాగా ఈ ఆప్షన్ను భారత్లోని ఫేస్బుక్ పేజ్ వ్యూయర్లకు కల్పించారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారికి వీలుగా ఈ ఆప్షన్ను డిజైన్ చేయడం విశేషం. మీరు సురక్షితంగా ఉన్నట్లయితే ఐ యామ్ సేఫ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే చాలు.. ఈ విషయం మీ సన్నిహితులు ఫేస్బుక్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.
శ్రీకాకుళం, విజయనగరం తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్
శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో తుపాన్ కారణంగా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 200 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. వజ్రపు కొత్తూరు ,పలాస, మందస మండలాల్లో గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
ఫొని ఎఫెక్ట్ : వాహనాల రాకపోకలపై ఆంక్షలు
తుఫాన్ కారణంగా ఉత్తర శ్రీకాకుళంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ముఖ్యమైన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను మాత్రం రక్షిత ప్రదేశాల్లోనే నిలిపి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై మాత్రం ప్రజలు బయట తిరగరాదని, ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరగడానికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
సహాయక చర్యలకు సిద్ధమైన నేవీ
తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సహాయక చర్యలను చేపట్టేందుకు నావికాదళం సిద్ధమైంది. ప్రజలకు అవసరమైన సహాయక సామాగ్రి, వైద్య సహాయ బృందాలతో ఇప్పటికే సహ్యాద్రి, కథ్మత యుద్ధ నౌకలు తీరానికి చేరుకున్నాయి.
కోల్కతా విమానాశ్రయం మూసివేత
ఫొని తుఫాన్ ప్రభావం ఒడిశా, ఏపీతో పాటు పశ్చిమబెంగాల్లో కూడా ఉండనుంది. తుఫాన్ ప్రభావంతో కోల్కతాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోల్కతా విమానాశ్రయాన్ని రేపు రాత్రి 9 గంటల నుండి మే 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరా
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జిల్లాలోని వీరఘట్టం, కొత్తూరు, హీరామండలం, పొందూరు, బూర్జ, ఎల్ఎల్ పేట, రాజాం, గార, సరుబుజ్జిలి, జలుమూరు, టెక్కలి, వజ్రపుకొత్తూరు, భామిని, సీతంపేట, ఆముదాలవలసలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నేటి అర్థరాత్రి నుంచి 24 గంటల వరకు విమానాలు బంద్
తీవ్ర పెను తుఫానుగా మారిన ఫొని రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ ఎయిర్ పోర్టు నుంచి విమానయాన సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నేటి అర్థరాత్రి నుంచి 24 గంటల వరకు విమానరాకపోకలు రద్దయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక..తిరిగి విమాన రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపారు.
103 రైళ్లను రద్దు
ఫొని హెచ్చరికలతో ఇప్పటికే ఈస్ట్కోస్ట్ రైల్వే 103 రైళ్లను రద్దు చేసింది. హౌరా – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, పాట్నా – ఎర్నాకులం ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ – భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్, హౌరా – హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ – రామేశ్వరం ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్లు రద్దు అయ్యాయి.