‘ప్లాస్మా దానం’ పేరుతో మోసాలు.. నిందితుడు అరెస్ట్
కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో వైద్యం చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో మంచి ఫలితాలు ఉండటంతో.. ప్లాస్మా డోనర్లకు భారీ డిమాండ్ వచ్చింది.
కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో వైద్యం చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో మంచి ఫలితాలు ఉండటంతో.. ప్లాస్మా డోనర్లకు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ కేటుగాడు క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగాడు. ప్లాస్మా దానం చేస్తానంటూ దాదాపు 200 మందిని అతడు మోసం చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ డిగ్రీ పూర్తి చేసి, హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. అయితే ఏ ఉద్యోగం లభించలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. ఈ క్రమంలో విశాఖపట్టణంలోని ద్వారక, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో ప్లాస్మా డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి వారికి ఫోన్లు చేసేవాడు. తాను కరోనా నుంచి కోలుకున్నానని, ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వారికి చెప్పేవాడు. ఈ క్రమంలో తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ-వాలెట్ వివరాలు చెప్పి, వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆ తరువాత వారి ఫోన్లకు స్పందించకుండా ఉండేవాడు. అంతేకాదు కరోనా చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ మరికొందరి నుంచి డబ్బులను గుంజాడు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు.
అయితే హైదరాబాద్ నగరానికి చెందిన కొందరిని మోసం చేయడంతో అతడిపై సిటీలోని పంజాగుట్ట, రామ్గోపాల్పేట, బంజారాహిల్స్తో పాటు సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఇతడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఓ ప్రత్యేక బృందం.. సోమవారం నిందితుడిని అరెస్టు చేసింది. తదుపరి చర్యల కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇలాంటి మోసగాళ్లు ఇంకొందరు ఉంటారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ కోరారు.