తండ్రి మాటకు మనస్తాపంతో యువతి ఆత్మహత్య
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తండ్రి మాటలకు మనస్తాపానికి గురైన ఓ కూతురు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కృష్ణా జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తండ్రి మాటలకు మనస్తాపానికి గురైన ఓ కూతురు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే…
జిల్లాలోని పామర్రు నియోజకవర్గ పరిధిలోని మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన రావూరి మావుళ్లయ్య తన కూతురిని నర్సింగ్ వరకూ చదివించాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికి వచ్చిన కూతురు తాను ఇంకా పై చదువులు చదువుకోవాలనుకుంటున్నట్లు తండ్రికి చెప్పింది. తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఉన్నత చదువులు చదివించే ఆర్థిక స్తోమత తనకు లేదని.. ఏదో ఒక ఉద్యోగంలో చేరి తమకు చేదోడువాదోడుగా ఉండాలని కోరాడు.
తండ్రి చెప్పిన మాటకు అంగీకరించలేక, తనకు ఎంతో ఇష్టమైన చదువును వదులుకోలేక ఆ కూతురు తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో అర్ధరాత్రి వేళ ఇంట్లోనే ఉరివేసుకుంది. తెల్లవారక ఉరికి వేలాడుతున్న కూతుర్ని చూసిన ఆ తల్లిదండ్రులు నిచేష్టులయ్యారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన కన్నబిడ్డను కిందకు దింపి కన్నీరుమున్నీరుగా విలపించారు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.