మహారాష్ట్రలో బ్యాంకు మహిళా ఉద్యోగి దారుణ హత్య.. నిందితుడు మాజీ మేనేజర్ అరెస్ట్
మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో విరార్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఐసీఐసీఐ బ్యాంకులో ఓ మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె సహోద్యోగి తీవ్రంగా గాయపడింది.
మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో విరార్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఐసీఐసీఐ బ్యాంకులో ఓ మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె సహోద్యోగి తీవ్రంగా గాయపడింది. మృతురాలిని యోగితా వర్తక్ గా గుర్తించారు. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈమెతో బాటు క్యాషియర్ శ్రద్దా దేవ్రుఖర్ తమ విధి నిర్వహణలో ఉండగా ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో ప్రవేశించి నగదును, జువెల్లరీని దోచుకుని పారిపోతుండగా ఈ ఇద్దరు మహిళా ఉద్యోగులు కేకలు పెట్టారు. వారిని పట్టుకునేందుకు యత్నించగా వారిలో ఒకడు కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యోగితా తీవ్రంగా గాయపడి మరణించింది. దుండగుల్లో ఒకడు ఈ బ్యాంకు మాజీ మేనేజర్ అనిల్ దూబే అని పోలీసులు తెలిపారు. లోగడ ఇతగాడు ఈ బ్యాంకు నుంచి , కోటి రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా ఈ బ్యాంకునే దోచుకునే కుట్ర చేశాడని పోలీసులు చెప్పారు. పారిపోతున్న ఇతగాడిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతనికి సాయపడిన మరొకడు పరారీలో ఉన్నాడు.
ప్రస్తుతం అనిల్ దూబే మరో బ్యాంకులో పని చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఇతని దాడిలో గాయపడిన శ్రద్దా దేవ్రు ఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనిల్ దూబే సహచరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాను పని చేసిన బ్యాంకులోనే ఈ మాజీ మేనేజర్ ఈ అఘాయిత్యానికి పాల్పడడం బ్యాంకు స్టాఫ్ ని తీవ్ర భయాందోళనకు, ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Snake Hulchul: నడుస్తూ ఉండగా వృద్దుడి కాళ్లను చుట్టేసిన విష సర్పం.. విడుపించుకున్నాక అతడు ఏం చేశాడో చూడండి